ఇప్పుడు భూమిపై ఉన్న ఖండాలు.. ఒకప్పుడు కలిసి ఉండేవనే సంగతి మీకు తెలుసా? లక్షల సంవత్సరాల కిందట భూమిపై భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి ఒకే విశాలమైన మహా ఖండంగా ఉండేవి. దాన్ని ప్యాంజియా (Pangaea) అని పిలిచేవారు. కాలక్రమేణా ప్యాంజియా రెండు భాగాలుగా విడిపోయింది. లారేషియా (Laurasia) ఖండం ఉత్తరార్ధగోళం వైపు, గొండ్వానా (Gondwana) దక్షిణార్ధ గోళం వైపు ప్రయాణించాయి. ఇప్పుడున్న మన ఇండియా, ఆస్ట్రేలియాలు గొండ్వానా ఖండంలోనే ఉండేవి. గొండ్వానా భూభాగం విచ్ఛిన్నమైనప్పుడు.. ఇండియా ఉత్తర దిశకు ప్రయాణించి.. ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది. దానివల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇక ఆస్ట్రేలియా ప్లేట్ తూర్పు దిశగా కదిలి.. ప్రత్యేక ఖండంగా స్థిరపడింది. అయితే, అది ఇంకా కదులుతూనే ఉంది.
ఔను, భూమిపై ఉన్న ఖండాలు నిత్యం కదులుతూనే ఉంటాయి. కానీ, వాటిని కంటితో కనిపెట్టలేం. చాలా చాలా నెమ్మదిగా అవి కదులుతాయి. అయితే, ఆస్ట్రేలియం ఖండం కాస్త భిన్నం. ఇది ఏడాదికి సుమారు 7 సెంటిమీటర్ల వేగంతో ఉత్తరంలోని ఈశాన్య దిశకు కదులుతోంది. అందుకే ఆస్ట్రేలియాను భూమిపై అత్యంత వేగంగా కదులుతున్న ఖండంగా పరిగణిస్తున్నారు.
భూమిలో అనేక పొరలు ఉంటాయి. భూమి పైభాగానికి లోపలు ఉండే పొరలకు అసలు పోలిక ఉండదు. భూమి ఊపరితలాన్ని క్రస్ట్ (Crust) అని పిలుస్తారు. క్రస్ట్కు భూకేంద్రం (Core) మధ్యలో ఉండేదాన్ని మాంటిల్ (Mantle) అంటారు. ఈ మాంటిల్, క్రస్ట్ కలిసి ఉండే ప్రాంతాన్ని ‘లిథోస్ఫియర్’ అంటారు. ఇది అనేక టెక్టానిక్ ప్లేట్లుగా విడిపోయి ఉంటుంది. ఈ ప్లేట్లు దాని కింద ఉండే వేడి మాంటిల్ మీద చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. దానివల్ల ఖండాలు విడిపోవడం, భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం వంటివి ఏర్పడుతుంటాయి. ఆస్ట్రేలియా కూడా ఇలాంటి ఒక టెక్టానిక్ ప్లేట్పైనే ఉంది. వివిధ శాటిలైట్స్, GPS స్టేషన్ల ద్వారా జరిపిన పరిశోధనల్లో.. ఆస్ట్రేలియా కదులుతున్నట్లు కనుగొన్నారు.
ఆస్ట్రేలియా ఖండం ఏడాదికి 7 సెంటీమీటర్లు చొప్పున కదులుతున్నాయని అంచనా. ఒక మిలియన్ ఏళ్లను లెక్కగా తీసుకుంటే ఇది 70 కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు. అయితే, ఆస్ట్రేలియా భవిష్యత్తులో ఇదే వేగంతో.. అదే దిశకు కదులుతుందని చెప్పలేం. కాలక్రమంలో దిశలో మార్పు రావచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా కదులుతున్న వేగాన్ని.. శాస్త్రవేత్తలు గోళ్లతో పోల్చారు. మన చేతి వేళ్ల గోళ్లు సగటున.. ఏడాదికి 4.2 సెంటీమీటర్లు పెరుగుతాయని, దానితో పోల్చితే ఆస్ట్రేలియా ఖండం.. దాదాపు 1.7 రెట్లు ఎక్కువ వేగంగా కదులుతోందని చెబుతున్నారు.
ఇండియా తరహాలోనే ఆస్ట్రేలియా ఇప్పుడు ఆసియా ఖండాన్ని ఢీకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రమేనా ఆసియా ప్రాంతానికి చేరువు అవుతోందని, కదలికలు ఇలాగే సాగితే అది సాధ్యమని చెబుతున్నారు. ఇప్పటికే టిమోర్, బండా ఆర్క్, న్యూగినియా ప్రాంతాల్లో ఆస్ట్రేలియా ఖండపు భూభాగం ఇతర చిన్న ప్లేట్లను ఢీకొడుతోందని, దానివల్ల ఆ ప్రాంతాల్లో భూకంపాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అక్కడ భౌగోళిక మార్పులను గమనిస్తుంటే.. ఆస్ట్రేలియా-ఆసియా ఢీకొనడం అనేది భవిష్యత్తులో జరగబోయే విషయం కదాని స్పష్టమవుతోంది. దాని ప్రభావం ఇప్పటికే భూగర్భంలో కనిపిస్తోంది.
రాబోయే 200 నుంచి 300 మిలియన్ సంవత్సరాల్లో భూమి ఖండాలు మరోసారి ఒక భారీ సూపర్కాంటినెంట్గా ఏర్పడే అవకాశం ఉంది. దీన్నే పరిశోధకులు అమేసియా (Amasia) అని పిలుస్తున్నాయి. ఈ సిద్ధాంతం ప్రకారం పసిఫిక్ మహాసముద్రం క్రమంగా మూసుకుపోతూ.. ఆసియా, ఆస్ట్రేలియా సహా ఇతర ఖండాలు భవిష్యత్తులో ఒక భారీ భూభాగంగా కలిసే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా.. నేరుగా ఆసియా ఖండంలోకి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?
పరిశోధకులు అంచనాలు నిజమైతే.. ఆస్ట్రేలియా ఖండం ముందుగా ఆసియాలోని ఇండోనేషియాను సమీపించే అవకాశం ఉంది. ఆ దేశంలోని తిమోర్, జావా, సమత్రా దీవుల కిందకు ఆస్ట్రేలియా ప్లేట్ చొచ్చుకెళ్లనుంది. జకార్తా వంటి నగరాలు.. భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో కలిసిపోతాయి. ఆ తర్వాత ఇండోనేషియాను నెట్టుకుంటూ ఫిలిప్పీన్స్, మలేషియాలను సమీపిస్తుంది. సుమారు 200 నుంచి 300 మిలియన్ (20-30 కోట్లు) సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా పూర్తిగా ఆసియా ఖండంలోకి చొచ్చుకెళ్ళి, చైనా, తూర్పు ఆసియా ప్రాంతాలతో కలిసిపోయి ‘అమేసియా’ అనే భారీ మహా ఖండంగా మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.