Medchal Traffic: స్వేచ్ఛ బ్యూరో: పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మేడ్చల్ పట్టణంలో జనాభా పెరుగుదలతో పాటు వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. భారీ అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు ఒక్కొక్కటిగా ఏర్పడుతున్నాయి. అయితే ప్రజలకు కనీస పార్కింగ్ సౌకర్యం కల్పించకుండానే కొన్ని సంస్థలు వ్యాపారాలు సాగిస్తుండటం ఇప్పుడు మేడ్చల్ ట్రాఫిక్ సమస్యను మరింత జఠిలంగా మారుస్తోంది.సంస్థలకు వచ్చే వినియోగదారుల వాహనాలన్నీ రోడ్లపైనే నిలుస్తుండటంతో ప్రధాన రహదారులు క్రమంగా పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి. ఫలితంగా నిత్యం వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
మేడ్చల్ మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారితో పాటు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట భారీ సంఖ్యలో వ్యాపార, వాణిజ్య సంస్థలు ఏర్పాటయ్యాయి. కానీ అనేక సంస్థలకు తగిన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు ద్విచక్ర వాహనాలు, కార్లను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు.మేడ్చల్ పారిశ్రామికవాడ నుంచి అత్వెల్లి వరకు జాతీయ రహదారి వెంట, కిష్టాపూర్ రోడ్డు, కోర్టు రోడ్డు, కేఎల్ఆర్ వెంచర్, గ్రంథాలయం రోడ్డు, వినాయక్నగర్ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అక్రమ పార్కింగ్ మరో తలనొప్పిగా మారింది.
జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ఆసుపత్రికి వచ్చే ద్విచక్ర వాహనాలను రాకపోకలకు ఉపయోగించే మార్గంలోనే నిలిపివేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కిష్టాపూర్ రోడ్డుకు వెళ్లేందుకు యూటర్న్ తీసుకునే మార్గంలో కూడా వాహనాలు పార్కింగ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏమిటి..? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read: కొండా సురేఖపై వేటుతో షాక్ తిన్న కీలక నేతలు.. సీఎం రేవంత్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?
కేఎల్ఆర్ వెంచర్లో ఇటీవల ఏర్పాటైన కొన్ని భారీ వ్యాపార సంస్థలకు సైతం సరైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డుపైనే నిలుస్తున్నాయి. సంస్థలకు ఎదురుగా ఉన్న ఇతర వ్యాపార సముదాయాలకు వచ్చే వాహనాలు కూడా అదే రోడ్డును ఆక్రమించడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది.వ్యాపార సంస్థలకు పార్కింగ్ స్థలం లేదా..? ఉంటే రోడ్డునే పార్కింగ్గా మార్చుకోవచ్చా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రోజురోజుకు జనాభా పెరుగుతున్న మేడ్చల్లో కొత్తగా భారీ వ్యాపార సంస్థలు ఏర్పాటవుతున్నప్పటికీ పార్కింగ్ సదుపాయాలపై సంబంధిత శాఖలు ఎంత మేరకు దృష్టి సారిస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. వ్యాపార సంస్థల ఏర్పాటు సమయంలో పార్కింగ్ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.పార్కింగ్ సౌకర్యం లేకుండా సంస్థలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను ఆక్రమించే వాహనాలపై, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also read: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?
మేడ్చల్ పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా రోడ్లపై వాహనాలను నిలిపివేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మేడ్చల్ ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు.నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసే వాహనాలపై 100 శాతం చలాన్లు విధిస్తామని స్పష్టం చేశారు. చలాన్లు విధించిన తర్వాత కూడా జరిమానాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తే అటువంటి వాహనాలను సీజ్ చేస్తామని తేల్చిచెప్పారు. వ్యాపార, వాణిజ్య సంస్థల కారణంగా ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్లను తమ సొంత పార్కింగ్ స్థలాలుగా భావించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.“ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ తప్పదు.. జరిమానా కట్టకపోతే వాహనం సీజ్ తప్పదు” అని ట్రాఫిక్ సీఐ క్రాంతి కుమార్ హెచ్చరించారు.మేడ్చల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులు తప్పనిసరిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also read: కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!