Sundar pichai : భారత్ పై గూగుల్ మరింత ఫోకస్ చేసింది. సేవలను మరిన్ని భాషల్లో అందించేందుకు కృషి చేస్తోంది. 100కిపైగా భారతీయ భాషల్లో టెక్స్ట్, వాయిస్ ద్వారా ఇంటర్నెట్లో సెర్చ్ చేసే వీలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. కృత్రిమమేధను వినియోగించి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు.
భారత్లో 10 ఏళ్లకు 1000 కోట్ల డాలర్లతో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ను గూగుల్ గతంలో ఏర్పాటు చేసింది. ఆ నిధులు కేటాయింపు వల్ల ఎంత పురోగతి జరిగిందో తెలుసుకోవడానికి భారత్కు వచ్చానని పిచాయ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వెయ్యి భాషలను ఆన్లైన్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకే భారత్ లో 100 భాషల్లో సెర్చ్ చేసే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మాతృ భాషలో సమాచారం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏఐ కోసం ఐఐటీ మద్రాస్తో కలిసి మల్టీ డిసిప్లేనరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారతీయులు సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగవుతున్నాయని చెప్పారు.
సుందర్ కు ముర్ము ప్రశంసలు
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. భారత నైపుణ్యానికి, జ్ఞాన సంపత్తికి సుందర్ పిచాయ్ ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. దేశంలో అందరికీ డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
మోదీతో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఇంటర్నెట్ను అన్ని వర్గాలకూ చేరువ చేసేందుకు తనవంతు సాయం చేస్తానని ప్రధాని మోదీకి సుందర్ పిచాయ్ తెలిపారు. మోదీతో గొప్ప భేటీ జరిగిందని పిచాయ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు మోదీ నాయకత్వంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. దృఢమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు ఇస్తామన్నారు.
మోదీ డిజిటల్ ఇండియా విజన్ సూపర్..
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ వల్లే దేశంలో సాంకేతికత మార్పులు అత్యంత వేగంగా జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు. భారత్ అతిపెద్ద ఎగుమతి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందన్నారు. ప్రజల భద్రతను పరిరక్షించాలని, కంపెనీలు వినూత్నంగా అడుగులు వేసేలా చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
అంకురాలపై ఫోకస్
భారత్లో అంకురాల కోసం గూగుల్ కేటాయించిన 300 మిలియన్ డాలర్లలో 25 శాతం నిధులు మహిళల సారథ్యంలో ఏర్పాటు చేస్తున్న స్టార్ట్ అప్ ల్లో పెట్టుబడిగా పెడతామని గూగుల్ ఇండియా వైస్ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. అందరికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 10 బిలియన్ డాలర్ల నిధిని గూగుల్, ఐడీఎఫ్ కింద ప్రకటించింది. ఈ నిధి ద్వారా జియోలో 7.73 శాతం వాటాను , భారతీ ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను గూగుల్ కొనుగోలు చేసింది.