Live-in relationship risks: సహజీవన ఒప్పందాల్లో ఎదురయ్యే అంతర్గత ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంటలు విడిపోయినప్పుడు పురుషులపై మహిళలు లైంగిక వేధింపుల కేసులు పెట్టే ధోరణి పెరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ తన భాగస్వామిపై దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వివాహం లేకుండానే సదరు వ్యక్తితో కలిసి ఉండి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు అత్యాచారం అసాల్ట్ అని ఆరోపించడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం లైంగిక దాడి ఆరోపణలకు ఎలా దారితీస్తుందని నిలదీశారు.
సహజీవనంలో ఇలాంటి పరిణామాలు సహజంగా కనిపిస్తున్నాయని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి కలిసి ఉండి విడిపోయే సమయంలో మహిళలు పురుషులపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. వివాహబంధం వెలుపల ఉండే ఇటువంటి సంబంధాల్లో అస్థిరత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. సంబంధం ఇష్టపూర్వకంగా కొనసాగినప్పుడు అక్కడ నేరం అనే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు. బాధితురాలు ఒక విధవరాలు కాగా నిందితుడు తనకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడని ఆమె తరపు న్యాయవాది వాదించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా లైవ్-ఇన్ రిలేషన్స్లోని చట్టపరమైన సంక్లిష్టతలను ధర్మాసనం ప్రస్తావించింది. కేవలం సంబంధం విచ్ఛిన్నమైనంత మాత్రాన ప్రతి శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు గత తీర్పులను గుర్తు చేసింది. మహిళలు తమ హక్కుల విషయంలో అవగాహనతో ఉండాలని సూచించింది. ఇరుపక్షాల అంగీకారంతో కొనసాగే బంధాల్లో తలెత్తే వివాదాలు నేరపూరిత అభియోగాల స్థాయికి వెళ్లడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: నోరు జారితే రాజకీయ భవిష్యత్తు ఖతం.. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం!