Telangana Congress: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, వరుసగా బహిరంగ విమర్శలు, వ్యాఖ్యలపై అధిష్టానం ఉక్కుపాదం మోపాలని చూస్తుంది. ముఖ్యంగా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే నేతలపై ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ వ్యాఖ్యలపై ఇక నో కాంప్రమైజ్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. గత కొంతకాలంగా కొందరు నాయకులు తమకు అప్పగించిన పదవులను అడ్డం పెట్టుకుని పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీ గుర్తించింది. సోషల్ మీడియా(Social Media) వేదికగా లేదా పత్రికా సమావేశాల్లో పార్టీ నిర్ణయాలను తప్పుబట్టడం, తోటి నాయకులపై విమర్శలు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిం చాలని క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆదివారం సుదీర్ఘంగా జరిగిన మీటింగ్లో చైర్మన్ మల్లు రవి పార్టీకి నష్టం చేయకు వచ్చే చర్యలపై సీరియస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితులను కట్టడి చేయకపోతే పదేళ్ల పవర్ సాధించడం కష్టతరంగా మారుతుందని పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నది. పదవుల్లో ఉంటే రెట్టింపు శిక్ష.. పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వారిని తక్షణమే పదవుల నుండి తొలగించడమే కాకుండా పార్టీ నుండి కూడా సస్పెండ్ చేస్తారు. గతంలో ఏదైనా తప్పు జరిగితే వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చేవారు. అయితే ఇకపై ప్రత్యక్షంగా పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే, వివరణలతో పనిలేకుండానే ‘డైరెక్ట్ యాక్షన్’ ఉంటుంది. ఒక నాయకుడిపై చర్య తీసుకోవాలా ?వద్దా? అనే సందిగ్ధానికి తావులేకుండా, ఆధారాలు లభించిన వెంటనే వేటు వేయనున్నారు.
Also Read: టాప్ రేంజ్ ఈవీ స్కూటర్స్, ఫుల్ ఛార్జ్ తో ఎన్ని వందల కి.మీ వెళ్లొచ్చంటే?
పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలను రోడ్డుపైకి తెస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కమిటీ స్పష్టం చేసింది. “పార్టీ అంటే ఒక కుటుంబం, సమస్యలు ఉంటే లోపల మాట్లాడుకోవాలి కానీ రచ్చకెక్కకూడదు” అని క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ హెచ్చరించారు. గత రెండేళ్లుగా పార్టీ నాయకులపై ఫిర్యాదులు వచ్చినా.. సున్నితంగా సమస్యను పరిష్కరించామని చైర్మన్ మల్లు రవి(MP Mallu Ravi) వివరించారు. ఎవరినీ నొప్పించకుండా పార్టీ బలోపేతం కోసం నాయకులు మధ్య సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లామన్నారు.. ఇప్పటికీ కొందరి నాయకులు క్రమశిక్షణ చర్యలపై లైట్ తీసుకుంటున్నారని, పార్టీ డ్యామేజ్ అవుతున్నా సొంత నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ మల్లు రవి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also read: తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఆ పది జిల్లాలపై స్ఫెషల్ ఫోకస్!