Supreme Court: మహిళ ఛా*తీ బాగాన్ని బలవంతంగా తాకడం అత్యాచార యత్నం కాదని పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ.. అసహనం వ్యక్తం చేసింది. మహిళలపై దాడికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పులను హైకోర్టులు ఏమాత్రం పరిశీలించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పాట్నా హైకోర్టు తీర్పుపై త్వరలోనే సమగ్ర ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు సీజేఐ పేర్కొన్నారు.
గతంలో పాట్నా హైకోర్టు తరహాలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ మోహన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఓ మైనర్ బాలిక పైజామా నాడ తెంచి కల్వర్ట్ కిందకు లాక్కెళ్లటానికి ప్రయత్నించటం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పుబట్టింది. అనంతరం ఆ ఉత్తర్వులను కొట్టిపారేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా పాట్నా హైకోర్టు మరోసారి అలాంటి తీర్పునే ఇచ్చిందంటూ సీనియర్ అడ్వకేట్ శోభా గుప్తా, హెచ్.ఎస్.ఫూల్క సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. ఆయా న్యాయస్థానాలు తీర్పులు చెప్పే ముందు గతంలో ఇలాంటి కేసుల్లో వచ్చిన తీర్పులను సరిగ్గా అధ్యయనం చెయ్యటం లేదని వ్యాఖ్యానించారు. పాట్నా హైకోర్టు తీర్పుపై త్వరలోనే సమగ్ర ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.
ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తుల్లో సున్నితత్వాన్ని, మానవత్వాన్ని పెంపొందించడానికి నేషనల్ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఒక మార్గదర్శకాలను రూపొందించిందని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. వీటికి సుప్రీంకోర్టు ఆమోదం కూడా ఉందన్నారు. దేశంలోని అన్ని కోర్టులు లైంగిక నేరాల కేసులను డీల్ చేసేటప్పుడు ఈ హ్యాండ్బుక్లో ఆమోదించిన పదాలను, భాషను మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాల పుస్తకాన్ని సుప్రీంకోర్టు, అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టుల అధికారిక వెబ్సైట్లలో వెంటనే అప్లోడ్ చేయాలని సూచించింది.
Also Read: పెద్దలకు ఉపయోగపడే.. అద్భుతమైన బ్లూటూత్ డివైజ్లు.. ఇక ఎవరిపై ఆధారపడక్కర్లేదు!
అంతేకాకుండా నేషనల్, స్టేట్ జుడీషియల్ అకాడమీలు, అన్ని లా యూనివర్సిటీలు, కాలేజీల లా డిపార్ట్మెంట్లలో దీనిని పంపిణీ చేయాలని న్యాయస్థానం దిశానిర్దేశం చేసింది. అన్ని రాష్ట్రాల డీజీపీలు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్లు తమ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మార్గదర్శకాల అమలుకు ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటపుడు, ఛార్జ్షీట్ దాఖలు చేసేటపుడు ఈ హ్యాండ్బుక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. బాధితులు అనుభవించిన మానసిక క్షోభను కోర్టుల్లో సరైన రీతిలో వివరించడానికి వీలుగా వివిధ ప్రాంతీయ భాషలు/యాసలలో వాడే పదాలను గుర్తించి ఒక జాబితా తయారు చేయాలని కూడా కమిటీని కోర్టు కోరింది.
Also Read: స్మార్ట్ఫోన్లలో ‘రిమూవబుల్ బ్యాటరీలు’ ఎందుకు మాయమయ్యాయి? అసలు రహస్యం ఇదే!