ఇద్దరూ ఇద్దరే. ఏపీకి సీఎంలు కావాల్సినోళ్లు. అంటే.. ఆ పదవి కోసం లైన్లో ఉన్నోళ్లని అర్థం. ఇద్దరూ ఒకే రోజు పోక్సో కేసుపై మాట్లాడారు. వెనుకా ముందు. అదీ ఏపీ రాజకీయాల కోసం తెలంగాణ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అదీ తెలంగాణ పోక్సో కేసుల విషయాన్ని తీసుకుని. బాగా వాడుకున్నారు. తమకు అనుకూలంగా. కూరలో కరివేపాకులా. మధ్యలో తెలంగాణలో పోక్సో కేసులు విషయాలనూ ఎలుగెత్తి చాటారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు..? ఏమా కథా?
ఒకరు పవన్ కళ్యాణ్. ఏపీలో లాకప్డెత్లు అవుతున్నా.. అక్కడ డెడ్బాడీయే దొరకకుండా చేసి బూడిదైనా ఇవ్వండి అన్నా… ఇప్పటికీ ఆ అదృశ్యం కేసు తేల్చని ఏపీ కూటమి సర్కార్.. అచ్చంగా, అప్పనంగా తెలంగాణ విషయంలో వేలు పెట్టింది. అదీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు. మంచిపేరు తెచ్చుకునేందుకు. తాము మంచోళ్లమని చెప్పుకునేందుకు.
పోక్సో కేసులు పెరిగిపోతున్నా ఏం చేస్తున్నావయ్యా సీఎం..? అని కడిగిపారేసినంత పనిచేశాడు పవన్. ఆ షాబాద్లో అంత మందిని చంపిన కేసులో .. వాడికి అసలు బెయిల్ ఎట్లా దొరికిందంటావ్..? అని నిలదీసి.. మాలెక్క అవసరమైతే పోక్సో కాకపోతే.. ఉపా కేసైనా పెట్టండి కానీ.. బయటకు రానీయకండి వెధవలను..!అని హింట్ ఇచ్చినట్టుగా ఓ లేఖ రాశాడు. ఇక్కడ బండి భగీరథ్ ఉదంతం ఉందనే సోయి ఉందో లేదో తెలియదు. అతనికి మొన్ననే బెయిల్ కూడా వచ్చిందనే అంశమూ తన పరిజ్జానంలో ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన అప్పటికప్పుడు స్పందిస్తాడు కాబట్టి.. ఆవేశపరుడు కాబడ్డి.. పెద్దగా ఆలోచించే తీరిక లేదు కాబట్టి…
మరొకరు లోకేశ్ బాబు..
కానీ లోకేశ్ .. పవన్లా కాదు కదా! ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఇటు బండి సంజన్నూ వెనుకేసుకొచ్చాడు. అటు తన ఏపీ రాజకీయాల్లో ఓ ప్రమాదం కేసులో నోరు జారిన జగన్ను ఇరికించేశాడు. అర్థం కాలేదు కదా! వివరాల్లోకి వెళ్దాం.
ఏపీకి చెందిన మాజీ మంత్రి.. అంటే వైఎస్సార్ సీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొడుకు .. పద్దెనిమిదేళ్లు ఉంటాయట. అతను బైకేసుకుని బుర్రున వెళ్లి… ఒకరిని టక్కరిచ్చాడంట. అతను చనిపోయాడు. అతనిపై కేసులు పెట్టారు. కామనే కదా…? కానీ జగన్కు కోపమొచ్చింది…? మొన్న సాయికృష్ణ లాకప్డెత్ విషయంలో మాట్లాడుతూ.. ఏదో తెలియక నేరం చేసి ఉంటాడు.. అని నోరు జారినట్టే.. ఇప్పుడు ఈ మాజీ మంత్రి కొడుకు ఏదో తెలియక బైక్తో యాక్సిడెంట్ చేస్తే కేసు పెడతారా? సరే, అది తప్పే అనుకో… కానీ కేసు పెడతారా? పాపం.. చిన్న పిల్లోడు కదండీ..? కేవలం 18 ఏండ్లేనండీ… అని దొరికిపోయాడు.
దీన్ని లోకేశ్ బాబు.. తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. దీనికీ తెలంగాణే అవసరమొచ్చింది. పోక్సో ఉదంతమే వాడాల్సి వచ్చింది. అక్కడ బండి సంజయ్ తన కొడుకు పై వచ్చిన ఆరోపణలకు నేరుగా తనే స్వయంగా కొడుకును పోలీసులకు అప్పగిస్తే.. జగనేమో.. కేసెలా పెట్టారనడం సమంజసమేనా? అని అడిగాడు.
ఇక్కడ బండిని వెనుకేసుకొచ్చాడు. ఆ ఉదంతాన్ని వాడుకుని జగన్ను ఇరికిచ్చాడు. మీ రాజకీయాల కోసం మమ్మల్నెందుకండీ.. మధ్యలో లాగుతారు. ఆ బండి కేసును మేం మరిచిపోయినా.. మీరు మరిచిపోయేలా లేరు. ఆ బీఆరెస్ వాళ్లను తట్టి లేపేలా ఉన్నారు. మీ ఏపీ రాజకీయాలకు మధ్యలో మేం ఆటలో అరటిపండులా దొరికామా? అని తెలంగాణ సర్కార్ వర్గాలు భగ్గుమంటున్నాయట. బండి వర్గం కూడా.