
ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పనుంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై జడ్జిమెంట్ ఇవ్వనుంది. దీంతో.. కశ్మీర్లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. అల్లర్లకు అవకాశం లేకుండా.. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. రెండు వారాలుగా కశ్మీర్ లోయలో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఇక తీర్పు ఎలా ఉన్నా తాము గౌవరిస్తామని స్థానిక నేతలు ప్రకటించారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఎవరూ రాజకీయం చేయొద్దని బీజేపీ సూచించింది. 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా తాము గౌరవిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఒకవేళ తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే.. న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావచ్చని గులాం నబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కశ్మీర్కు చెందిన రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాటిపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. తర్వాత సెప్టెంబరు 5న తీర్పును రిజర్వులో ఉంచింది. ఇవాళ తీర్పును చెప్పనుంది.