ISRO : ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై కుట్ర కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేసింది. ఈ కేసును తిరిగి కేరళ హైకోర్టుకే బదిలీ చేసింది.
కేసు నేపథ్యం
1994లో క్రయోజనిక్ ఇంజిన్ తయారీకి సంబంధించిన కీలక పత్రాలను ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశీయులకు అప్పగించారని ఆరోపిస్తూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నంబి నారాయణ్ పై నమోదైన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. క్రయోజనిక్ ఇంజిన్ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్పై ఈ ఆరోపణలు చేశారని పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి పోలీసు అధికారులు మాజీ డీజీపీ ఆర్.బి. శ్రీకుమార్, విశ్రాంత నిఘా అధికారి పి.ఎస్. జయ్ప్రకాశ్, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్. విజయన్, థంపి ఎస్ దుర్గా దత్పై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో నిందితులకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సీబీఐ వాదనలు ఇవే
కేరళ హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నంబి నారాయణ్పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. రోదసీ కార్యక్రమాలు రెండు దశాబ్దాలపాటు వెనకబడ్డాయని వాదనలు వినిపించింది. ఇది చాలా త్రీవమైన అంశమని, విదేశీ కుట్రలో భాగమై పోలీసులు ఇలా చేసి ఉండవచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది. నిందితులకు బెయిల్ ఇస్తే.. విచారణకు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ఇదే
ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సి.టి. రవికుమార్ ధర్మాసనం సీబీఐ అప్పీళ్లను అంగీకరిస్తున్నామని ప్రకటించింది. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తిరిగి హైకోర్టుకే పంపిస్తున్నామని తెలిపింది. నిందితుల బెయిల్ దరఖాస్తులను మళ్లీ మొదటి నుంచి విచారించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా దీనిపై తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే ముందస్తు బెయిల్ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువరించే వరకు నిందితులను అరెస్టు చేయకుండా వారికి రక్షణ కల్పించింది.