Suvendu Adhikari West Bengal CM: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టబోతున్నట్లు బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కోల్కతాలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలందరూ సువేందు అధికారిని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పుగా నిలిచింది. రేపు అనగా మే 9వ తేదీ ఉదయం 11 గంటలకు కోల్కతాలోని ప్రతిష్ఠాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి రికార్డు సృష్టించనున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పోరుకు ఈ విజయంతో ఫలితం లభించినట్లయింది. సువేందు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా కోల్కతా వీధులన్నీ కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్ అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్రం ప్రజాస్వామ్య క్షీణత, శాంతిభద్రతల పతనంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ ఓటమితో బెంగాల్ ప్రజలకు అరాచక పాలన నుండి విముక్తి లభించిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత ఇకపై భారతీయ జనతా పార్టీపైనే ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.
Read Also: రాహుల్ వ్యూహం.. బీజేపీకి గర్వభంగం! ఏన్డీయేపై ఇండి కూటమి రెండో విజయం..!