తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళగం (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. విజయ్కు విజిల్ గుర్తును, మరో స్టార్ హీరో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
రానున్న కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలవబోతున్న కొత్త, గుర్తింపు పొందని పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించే ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. నటుడు విజయ్ తన పార్టీ టీవీకే (TVK) కోసం నవంబర్ 11న దరఖాస్తు చేసుకోగా.. గురువారం ఆయన కోరుకున్న విధంగా ‘విజిల్’ గుర్తును మంజూరు చేసింది.
నిజానికి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్, తెలుగులో విజిల్ పేరుతోనే విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే పేరు గల గుర్తు ఎన్నికల గుర్తుగా రావడంతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెంటిమెంట్ రాజకీయాల్లో కూడా విజయానికి బాటలు వేస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని విజయ్ ఇప్పటికే కేడర్ను సమాయత్తం చేస్తున్నారు.
మరోవైపు, లోకనాయకుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (MNM) గతంలో తాము పోటీ చేసిన ‘బ్యాటరీ టార్చ్’ గుర్తునే మళ్లీ పొందింది. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమల్ పార్టీ ఇదే గుర్తుపై పోటీ చేసింది. నవంబర్లో కమల్ పార్టీ చేసిన విన్నపాన్ని పరిశీలించిన ఈసీ, పాత గుర్తునే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో ప్రస్తుతం ద్రవిడ రాజకీయాల మధ్య సినీ తారల ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. విజయ్ తన తొలి ఎన్నికల పోరాటాన్ని ‘విజిల్’ వేస్తూ ప్రారంభించబోతుండగా.. కమల్ ‘టార్చ్’ పట్టుకుని వెలుగులు నింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల పార్టీలకు గుర్తులు కేటాయించడంతో తమిళ రాజకీయ ముఖచిత్రం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.