Shabad Murders: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆరుగురు దారుణ హత్యల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి దారుణంగా మట్టుబెట్టిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తుకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ను ఉన్నతాధికారులు వెల్లడించారు.
నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డు
ఈ ఘోర కలికానికి కారణమైన నిందితుడు రాజ్కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లేదా అతడిని పట్టుకోవడంలో సహాయం చేసిన వారికి రూ. 2 లక్షల రివార్డు అందిస్తామని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Also Read: పార్టీ లైన్ దాటిన ఈటల.. సొంత ఇమేజ్ కోసమా? సొంత గూటి కోసమా?
షాబాద్ ఎస్సై రమేశ్ సస్పెన్షన్
ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు రావడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, బాధితుల ఫిర్యాదులపై సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారనే ఆరోపణలతో షాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) రమేశ్పై వేటు పడింది. ఎస్సై రమేశ్ను సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఈ దారుణ హత్యల వెనుక అసలు కారణాలు ఏంటి? నిందితుడికి ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని ఉన్నతాధికారులు నొక్కి చెప్పారు.