తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ విమర్శల స్థాయి దాటి, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ఈ వివాదంలోకి లాగడంపై మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముందు త్రిష నుంచి దూరమవ్వాలి..
శుక్రవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన నయినార్ నాగేంద్రన్, విజయ్పై విరుచుకుపడ్డారు. గతంలో తమ కూటమిపై విజయ్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. ఆయనకు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేశారు. ‘విజయ్కు ఏమీ తెలియదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడాలి. దానికంటే ముందు అతను త్రిష నుంచి దూరమై బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని నడిపించే ముందు తన కుటుంబ సంబంధాలను సరిదిద్దుకోవాలని, గొప్ప నాయకులు ఉద్యమాలు ఎలా నిర్మించారో తెలుసుకోవాలని ఆయన సూచించారు. విజయ్ తీరు ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉంది’ అని ఘాటుగా విమర్శించారు.
ఓట్లు అంత సులభం కాదు..
కేవలం సినిమా గ్లామర్తో ఓట్లు రాలవని నాగేంద్రన్ అభిప్రాయపడ్డారు. విజయ్ నటుడు కాబట్టి 32 శాతం ఓట్లు సాధిస్తారనుకోవడం భ్రమ అని, గతంలో విజయకాంత్ సభలకు కూడా భారీగా జనం వచ్చారని, కానీ ఆ జనసమూహం ఓట్లుగా మారలేదని గుర్తు చేశారు. రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు.
అండగా నిలిచిన ప్రత్యర్థులు.. తీవ్ర ఖండన
నయినార్ నాగేంద్రన్ చేసిన ఈ వ్యక్తిగత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. విజయ్ను నిత్యం రాజకీయంగా విమర్శించే అధికార డీఎంకే పార్టీ నుంచి ఆయనకు అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మహిళా ఎంపీలు కనిమొళి, తమిళచ్చి తంగపాండ్యన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా ఉండి, మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని వారు హితవు పలికారు. రాజకీయ పోరాటం సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప, ఒక మహిళ పేరును ఇలాంటి సంభాషణల్లోకి లాగడం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
బీజేపీ మిత్రపక్షమైన ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ అధినేత టీటీవీ దినకరన్ సైతం నాగేంద్రన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావుండకూడదని సూచించారు. టీవీకే సీనియర్ నేతలు ఏకే సెంగోట్టయ్యన్, నాంజిల్ సంపత్ స్పందిస్తూ.. నాగేంద్రన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తోందని వారు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఈ వివాదం తమిళనాట సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ALSO READ: Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం