అండమాన్ నికోబార్ దీవులు, మయన్మార్ ప్రాంతాల్లో వరుసగా సంభవించిన భూకంపాలు బంగాళాఖాత తీర ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకంపనల సెగ తగ్గకముందే.. మంగళవారం మయన్మార్లో భారీ భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మయన్మార్ను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంప ప్రభావం పక్కన దేశాలైన భారత్, బంగ్లాదేశ్లపై తీవ్రంగా పడింది.
కోల్కతా, ఢాకాలో పెచ్చులు ఊడిన ఇళ్లు
మంగళవారం వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సహా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భూమి గట్టిగా కంపించింది. కోల్కతాలోని పలు పురాతన కట్టడాలు, నివాస గృహాల గోడలకు పగుళ్లు ఏర్పడగా.. కొన్ని చోట్ల పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఇళ్లలోని సామాగ్రి, వంట గదిలోని పాత్రలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అటు ఢాకాలో కూడా బహుళ అంతస్తుల భవనాలు ఊగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
వరుసగా రెండు రోజుల వ్యవధిలో అండమాన్, మయన్మార్ ప్రాంతాల్లో భూకంపాలు రావడం భూగర్భంలో జరుగుతున్న మార్పులకు సంకేతమని భూకంప శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. ఆస్తి నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Arava Sridhar: కమిటీకి ఆధారాలు సమర్పించాను.. త్వరలోనే అన్ని నిజాలు బయటపెడతా: రైల్వేకోడూరు ఎమ్మెల్యే