Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అనర్హత పిటిషన్ పై ఈ నెల 4న విచారణ జరగనుంది. విచారణకు హాజరుకావాలని కడియం శ్రీహరికి మంగళవారం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. కేపీ వాదనలను స్పీకర్ నమోదు చేయనున్నారు. స్పీకర్ తీర్పును పెండింగ్ లో పెడతారా? వెంటనే ప్రకటిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9మందిని స్పీకర్ విచారించారు. 8మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు ఆధారాలు ఏమీ లేవన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు తీర్పు వెలువరించారు. దానం నాగేందర్ ను గత నెల 30న విచారించిన స్పీకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గడువు కోరడంతో ఈ నెల 18న విచారణ చేపట్టి స్పీకర్ తుది తీర్పును వెల్లడించనున్నారు. అయితే స్పీకర్ నిర్ణయం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది.