Kolkata: బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు షాక్ల మీద షాకులు ఇస్తున్నారు. కొందరు తిరుగుబాటు చేస్తుండగా, మరికొందరు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇంకొందరు పార్టీని ప్రశ్నిస్తూ పార్టీకి, పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ ఎంపీ పదవి- పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.
టీఎంసీలో ఆరని సంక్షోభం
కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన టీఎంసీ, ఎంతవేగంగా పుంజుకుందో.. అదే స్థాయిలో పతనం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఎవరికి వారు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈసారి రాజ్యసభ సభ్యుల వంతు అయ్యింది. టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అంతేకాదు పార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీతో తనకున్న బంధాన్ని తెంచేసుకున్నారు. టీఎంసీ పార్టీ చరిత్రలో నేతలు తిరుగుబాటు తర్వాత కొద్దిరోజులకే రాయ్ తప్పుకున్నారు. బెంగాల్ అసెంబ్లీలో ఆ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది సభ్యులు వేరు కుంపటి పెట్టుకున్నారు.
ఈసారి రాజ్యసభ సభ్యుల వంతు.. పదవులు, పార్టీకి రాయ్ గుడ్ బై
పార్టీ నుండి విడిపోయిన ఎమ్మెల్యే రీటాబ్రత బెనర్జీ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్ష కూటమిగా గుర్తింపు సాధించారు. తన రాజీనామా లేఖలో రాయ్ కీలక విషయాలు ప్రస్తావించారు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి మమతా 15 ఏళ్ల అరాచక పాలన కారణమని దుయ్యబట్టారు.
టీఎంసీ హయాంలో అవినీతి, మహిళలపై అఘాయిత్యాలు, విద్య, పరిశ్రమ, శాంతిభద్రతలు, ఉపాధి వంటి కీలక రంగాలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. ఫలితాలను ప్రస్తావిస్తూ టీఎంసీ సుదీర్ఘ పాలనకు ముగింపు పలికేలా ఓటర్లు బీజేపీకి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని రాసుకొచ్చారు. పాలనపై ప్రజాగ్రహం, అవినీతి పార్టీ పతనానికి దారితీశాయన్నది ఆయన ప్రధాన మాట.
ALSO READ: ఢిల్లీ ఎయిర్పోర్టులో గాలి వాన బీభత్సం..తప్పిన ప్రమాదం.. మూడు విమానాలు డ్యామేజ్
బెంగాల్ అభివృద్ధి, పునర్నిర్మాణం, ఎన్నికల హామీలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నామని, తాను రాజ్యసభ సభ్యత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
2011 నుండి టీఎంసీ తరపున రాజ్యసభ సభ్యుడిగా రాయ్ కొనసాగుతున్నారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా ఆ పార్టీకి పెద్ద షాక్ గా వర్ణిస్తున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ మానసికంగా ఎప్పుడో దూరమయ్యానని ఇటీవలే మనసులోని మాట బయపెట్టారు. బెంగాల్ రాజకీయాల్లో సుఖేందు శేఖర్ రాయ్ అడుగులు ఎటు వైపు ఉంటాయనే దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది.