Panna News: ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న ఇద్దరు నిరుపేద స్నేహితుల కష్టాలు ఫలించాయి. మధ్యప్రదేశ్లోని వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన పన్నా జిల్లాకు చెందిన సతీష్, సాజిద్ అనే ఇద్దరు మిత్రులు తమ సోదరీమణుల పెళ్లిళ్లు ఘనంగా చేయాలనే లక్ష్యంతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే పనిగా.. సుమారు 20 రోజుల నుంచి లీజుకు తీసుకున్న చిన్న గనిలో తవ్వకాలు జరపడం ప్రారంభించారు. తవ్వుతూ తవ్వుతూ ఉండగా వారికి జాక్ పాట్ లభించింది. సుమారు రూ. 50 లక్షల విలువైన అత్యంత క్వాలిటీ వజ్రం లభించింది. ఈ అద్భుతమైన విజయం ఆ ఇద్దరు స్నేహితుల జీవితంలోనే కాక.. వారి కుటుంబాల్లోనూ సరికొత్త వెలుగు నింపింది. అసలు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసేవారు.. వారి పనులు ఏంటి..? అనే దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం.
పన్నా జిల్లాకు చెందిన సతీష్ ఒక మటన్ షాపును నడుపుతుండగా.. సాజిద్ పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇద్దరూ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చినవారే. తమ దైనందిన కష్టాలను అధిగమించి.. ముఖ్యంగా తమ చెల్లెళ్ల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయాలని వారి మనస్సులో పడింది. ఈ లక్ష్యంతోనే వారు వజ్రాల వేట వైపు దృష్టి సారించారు. సాజిద్ కుటుంబంలో అతని తండ్రి, తాత కూడా గతంలో వజ్రాల వేట సాగించినా.. వారికి మాత్రం ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయినా నిరుత్సాహపడకుండా.. సతీష్, సాజిద్ కలిసి ఒక చిన్న గనిని లీజుకు తీసుకుని.. ఇరవై రోజుల క్రితం తమ తవ్వకాలను ఉత్సాహంగా ప్రారంభించారు.
రెండు వారాలకు పైగా వారు పడిన శ్రమ, నిరీక్షణకు తగిన ఫలితం దక్కింది. నిన్న తవ్వకాలు జరుపుతుండగా.. ఒక మెరిసే రాయి వారి కంటపడింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన స్నేహితులు ఆలస్యం చేయకుండా.. దానిని స్థానిక డైమండ్ అధికారికి అప్పగించారు. అధికారులు ఆ రాయిని జాగ్రత్తగా పరిశీలించి.. అది 15.34 క్యారెట్ల బరువున్న అత్యంత నాణ్యమైన వజ్రంగా నిర్ధారించారు. మార్కెట్ అంచనా ప్రకారం.. దీని విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ అరుదైన వజ్రాన్ని వేలం వేయనున్నట్లు డైమండ్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆ ఇద్దరు మిత్రులు చెరి సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
వజ్రం దొరికిందనే శుభవార్తతో సతీష్, సాజిద్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. స్నేహానికి గౌరవం ఇస్తూ వచ్చిన డబ్బులు పంచుకోవాలనుకున్నారు. సంతోషంతో మీడియాతో మాట్లాడిన ఆ స్నేహితులు తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఈ డబ్బుతో ముందుగా వారి సోదరీమణుల పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ‘వారి పెళ్లిళ్లు మా జీవిత లక్ష్యం. అది తీరిన తర్వాత, మిగిలిన మొత్తంతో ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించి.. జీవితంలో స్థిరపడతాం’ అని వారు తెలిపారు. తమ కష్టాన్ని నమ్ముకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరు స్నేహితులకు లభించిన విజయం.. పన్నా జిల్లాలో ఎంతోమంది నిరుద్యోగ యువతకు స్ఫూర్తినిస్తోంది.
ALSO READ: Sangareddy Crime: రాష్ట్రంలో దారుణ పరువు హత్య.. ఇంటికి పిలిపించుకొని.. దారుణంగా కొట్టి చంపేశారు