Congress Vs Bjp: ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ విదేశీ పర్యటనలపై పలు ప్రశ్నలు సంధించింది కేంద్రం. ఆయన టూర్ కోసం సమకూరుస్తున్న నిధులు, పర్యటనల కోసం ఖర్చు చేస్తున్న నిధులపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు కేంద్రమంత్రి.
రాహుల్గాంధీ ఫారెన్ టూర్లు.. లెక్కల మాటేంటి?
ప్రతి ఎంపీ తమ విదేశీ పర్యటనల వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. విదేశీ ఆతిథ్యం చట్టం-2010లోని నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అవి రాహుల్గాంధీకి వర్తిస్తాయన్నారు. ప్రతి ఎంపీ తమ విదేశీ పర్యటనకు మూడు వారాల ముందుగా లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటేరియట్లకు తెలియ జేయాలన్నారు.
ఇది అనుమతి కాదని, కేవలం సమాచారం మాత్రమేనన్నారు. ఎంపీలు విదేశాలకు వెళ్లవచ్చని, కానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఏదైనా ఎంపీలు విదేశీ ఆతిథ్యాన్ని స్వీకరించాలనుకుంటే.. ఆ ఎంపీని ఆహ్వానించిన ఏజెన్సీలు లేకుంటే సదరు సంస్థలు భరించాల్సిన ఖర్చు ఎఫ్సీఆర్ఏ పరిధిలోకి రావాలన్నారు.
పలు ప్రశ్నలు సంధించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
2004 నుంచి రాహుల్ ఎంపీగా ఉన్నారని, దాదాపు ఆయన 54 విదేశీ పర్యటనలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కేవలం 54 పర్యటనలకే పరిమితం కాదని ఆయన దేశం వెలుపల ఎన్ని రోజులు ఉన్నారు, ఎంత ఖర్చు చేశారు అనే విషయాలు కూడా చూడాలన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీకి తన విజ్ఞప్తి ఒక్కటేనని, నిబంధనలను పాటించాలని, అవసరమైన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు.
ఒకవేళ ఏమైనా జరిగినా ఏమైనా చర్యలు తీసుకున్నా, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారని ప్రభుత్వాన్ని నిందించకూడదన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆదాయం కంటే రాహుల్ విదేశీ ఖర్చులు ఎక్కువగా ఉంటే.. ఆదాయపు పన్ను శాఖకు ఆందోళన కలిగించే విషయమన్నారు. ఆదాయం వెల్లడించినా వెల్లడించకపోయినా దానికి లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు.
ALSO READ: ఇంధనం పొదుపులో బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఏపీ బాటలో ఉత్తరాఖండ్
గురువారం బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర.. రాహుల్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ప్రకటించిన ఆదాయం రూ. 11 కోట్లుని తెలిపారు. ఆయన ఐరోపాతోపాటు వివిధ ఖండాల్లో 54 విదేశీ పర్యటనలకు సుమారు రూ. 60 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించిన విషయం తెల్సిందే.