తనకు జైలు జీవితం ఎంతో నేర్పిందన్నారు కవిత. జీవితం చాలా చిన్నదని తెలుసుకున్నాను. ఈ కొద్ది సమయంలోనే ఏవైనా ప్రజలకు మేలు చేసేఏ పెద్ద పనులు చేయాలని నిర్ణయించుకున్న.. అందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యలో ఆమె తన పర్సనల్ విషయాలు, రాజకీయ అంశాలపై స్పందించారు. లిక్కర్ స్కాం.. అనేది పక్కాగా బీజేపీ పన్నిన కుట్ర, వ్యూహమని చెప్పిన ఆమె.. దీని ద్వారా అక్కడ కేజ్రీవాల్ను, ఇక్కడ కేసీఆర్ను దెబ్బకొట్టేందుకు తనను ఇరికించారని, ఆ వచ్చిన తీర్పే దీనికి నిదర్శమని అన్నారామె. అయితే ఆ కేసు విషయంలో తాను జైలుకు వెళ్లినప్పుడు.. తన ఫ్యామిలీ నుంచి సపోర్టు లేదని, పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్ గురించి ప్రస్తావించారామె.
అత్తింటి వారి నుంచే తనకు పూర్తి మద్దతుందని, వారిచ్చిన ధైర్యమే ఇలా ముందుకు నడిపిస్తున్నదని గుర్తు చేసుకున్నారు.కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికి మరిచిపోరని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అంటే తనకూ ఇష్టమేనని, బీఆరెస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ తోనే తనతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా సమస్యలున్నాయన్నారు. ఎన్టీఆర్, కేసీఆర్ అంటే రాజకీయంగా ఎలాంటి చరిత్ర సృష్టించి, దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి, ఆకట్టుకున్నారో.. ఆ కోవలోకే తాను చేరాలనుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ ద్వారానే లీడర్ లక్షణాలను అలవర్చుకున్నానని, ఇప్పుడు తనలోని లీడరే.. ఆ కేసీఆర్నూ ప్రశ్నిస్తున్నదన్నారు.
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఓ అమ్మలా సేవలందించాలనుకుంటున్నానని, ఆ కుటుంబంలో అక్క పాత్ర కొంత వరకే.. అమ్మ పాత్ర మాత్రం ప్రాణం పోయే వరకూ ఉంటుంది. అందుకే అమ్మతనం స్పురించే పాలనను అందించేందుకు తెలంగాణ ప్రజలకు అమ్మలా ఉండాలనుకుంటున్నానన్నారు. తమిళనాట రాజకీయాలు.. అక్కడి కొత్త రాజకీయ వాతావరణాన్ని స్వాగతించాయని, విజయ్ ద్వారా మర్యాద పూర్వకంగా ఎలా విమర్శలు చేయొచ్చో నేర్చుకున్నానన్న కవిత.. తెలంగాణలో విజయ్ టీవీకే పార్టీలాగే తమ టీఆరెస్ పార్టీ కూడా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అబద్దం చెప్పే గుణం తనలో లేదన్న కవిత.. చచ్చినా అబద్దం చెప్పను. ఇదే తన బలం, బలహీనతగా పేర్కొన్నారు. కానీ అంతిమంగా నిజం నిలకడ మీద నిలుస్తుందని, మన ఆలోచనలో స్పష్టత ఉంటుందన్నారు. ఎవరి సపోర్టు లేకుండా తాము విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేసిన కవిత.. జెన్ జీ కూడా నూతన రాజకీయ వేదికలను పంచుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాగునీటి రంగంలో గత పదేళ్లు పాలించిన బీఆరెస్ సర్కార్.. రూ. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇంత ఖర్చు చేసి అదనంగా 15 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరందించగలిగిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ కూడా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందని పర్కొన్నారు. తాను సాగునీటి వనరులు, నదీ జలాల వినియోగం అంశాలపై లోతైన అధ్యయనం చేశానని, అధికారంలోకి రాగానే తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరందించే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ వచ్చి ఇన్నేండ్లవుతున్నా.. ఇంకా పాలమూరు నుంచి వలసలు ఎందుకు వెళ్తున్నారని, అక్కడ తండాలకు తాళాలెందుకు పడతున్నాయని ప్రశ్నించిన ఆమె.. పొలాలకు సాగునీరు లేక ఇలా జరుగుతుందన్నారు. తన పార్టీ ద్వారా చేయూత కరువైన అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని, మానవత్వంతో కూడిన పాలన అందిస్తామన్నారు.
తన పార్టీ దేశంలోని, రాష్ట్రంలోని మహిళలందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తుందని, వెనుకడుగు వేసేది లేదని, ఫెయిల్ అయ్యేదీ లేదని ధీమా వ్యక్తం చేశారు కవిత. నేపాల్ ప్రభుత్వాన్ని జెన్ జీనే ఓడించిందన్నారు. తనకూ తెలంగాణ ఉద్యమం అన్నీ నేర్పిందని, అన్ని విషయాలపై సమ్రగమైన పట్టు.. విషయ పరిజ్ఞానంతోనే పార్టీని స్థాపించి ప్రజా సేవకు ముందుకు వచ్చానన్నారామె. ఒక చిన్న సంఘటన రాజకీయాల్లో తీవ్ర మార్పులకు వేదికవుతుందని, ఒక తప్పు.. పూడ్చలేని నష్టాలను మిగుల్చుతుందని, తెలంగాణ రాజకీయాల్లోనూ అది జరుగుతుందన్నారు. తమకు అధికారం రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారామె. బీఆరెస్లో ఉన్నప్పుడు అంతర్గతంగా ప్రశ్నించానని, ఇప్పుడు బహిరంగ వేదికల మీద ప్రశ్నిస్తున్నానని, తానెప్పుడూ అదే విధానంతో క్లారిటీతోనే ఉన్నానన్నారు.