Johnny Johnny Yes Papa Controversy: ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యోగేంద్ర పిల్లలు నర్సరీ చదువుతుండగానే అబద్దాలు నేర్చుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రసిద్ధ ఆంగ్ల పద్యం ‘జానీ జానీ ఎస్ పాపా’ భారతీయ విలువలకు ప్రాతినిధ్యం వహించదన్నారు ఆయన. ఇది పిల్లల్లో చిన్నతనం నుంచే అబద్ధాలు చెప్పే బీజాలను నాటుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాన్పూర్లోని మర్చంట్ ఛాంబర్ హాల్లో జరిగిన శిక్షా మిత్రల (కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు) సమావేశంలో ప్రసంగిస్తూ.. పాశ్చాత్య దేశాల విలువలకు మధ్య ఉన్న తేడాలపై ఆయన కొత్త చర్చకు తెరలేపారు.
పిల్లల జీవితాలను తీర్చిదిద్దే క్రమంలో పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలను బోధించే వ్యవస్థను నిర్మించాలని మంత్రి ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయులు కేవలం బోధకులుగా కాకుండా గురువులుగా మారినప్పుడే విద్యార్థుల్లో విలువలను పెంపొందించగలరని స్పష్టం చేశారు. పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దైనందిన జీవితంలో చిన్న చిన్న పాఠాల ద్వారా విద్యార్థులకు సరైన మార్గాన్ని చూపాలని సూచించారు.
ముఖ్యంగా ఆంగ్ల పద్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ‘జానీ జానీ ఎస్ పాపా’ వంటి పద్యాలు ప్రస్తుత తరానికి అవసరమైన విలువలను అందించవని ఆయన అభిప్రాయపడ్డారు. అందులోని ‘ఈటింగ్ షుగర్.. నో పాపా’ (చక్కెర తింటున్నావా అంటే.. లేదు నాన్న అని చెప్పడం) వంటి వాక్యాలు తల్లిదండ్రుల ముందే అబద్ధాలు చెప్పేలా పిల్లలను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. దీనికి విరుద్ధంగా పాత తరాలు చదువుకున్న హిందీ పద్యాల్లో లోతైన జీవిత విలువలు ఉండేవని.. వాటిని నేర్చుకోవడం వల్ల పిల్లల వ్యక్తిత్వం మెరుగుపడుతుందని బీజేపీ నేత ఉపాధ్యాయ కొనియాడారు.
Read Also: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు