Delhi: పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర విధానాలను తప్పుబట్టారు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేంద్రం వ్యాఖ్యలు ప్రజల్లో మరింత గందరగోళానికి దారితీస్తాయన్నారు.
పాస్పోర్ట్పై విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు
కేంద్రప్రభుత్వం తీరుపై ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎంఐఎం అధినేత ఓవైసీ. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో బీజేపీ సభ్యత్వ కార్డు ఉన్నవారికే పౌరసత్వం ఇస్తారేమోనంటూ ఎద్దేవా చేశారాయన. బీజేపీ సభ్యత్వ కార్డుల చిత్రాలను తన పోస్టులో షేర్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే పత్రాల్లో పాస్పోర్టు ఒకటని, అలాంటి పత్రాన్ని పౌరసత్వానికి ఆధారం కాదని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ప్రభుత్వాలు తరచూ నిబంధనలు మార్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తేల్చి చెప్పారు. దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు రావడం బాధాకరమన్నారు.
బీజేపీ కార్డు మాత్రమే పౌరసత్వాన్ని నిరూపిస్తుందా-ఓవైసీ
ఏ పత్రమూ పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువు కాదని, 2030 నాటికి కేవలం ఒక్క పత్రం మాత్రమే పౌరసత్వానికి రుజువుగా ఉంటుందని రాసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కార్డు AI రూపొందించిన చిత్రాన్ని పంచుకున్నారు. ఇది పౌరసత్వానికి ఏకైక రుజువుగా మారుతుందని ఎద్దేవా చేశారు.
అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత పౌరసత్వానికి ఏకైక రుజువు హిందువుగా ఉండటంతోపాటు బీజేపీ ఓటరుగా ఉండటమేనని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. పౌరసత్వానికి రుజువుగా ఏ పత్రం పని చేస్తుందని ప్రశ్నించారు.
ALSO READ: తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ
పాస్పోర్ట్ అనేది ప్రధానంగా ప్రయాణ పత్రమని, దాన్ని పౌరసత్వానికి రుజువుగా పరిగణించరాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. పాస్పోర్ట్ను పౌరసత్వానికి ప్రూఫ్గా చూడలేదని తెలిపింది.
పుష్కరకాలంలో అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని తెలిపింది. పౌరులు కాని వారికి పాస్పోర్ట్ను జారీ చేసే వెసులుబాటు చట్టంలో ఉందన్నారు. అది ఉందంటే పౌరసత్వాన్ని నిర్ధారించినట్టు కాదని తెలిపింది. 2013లో బాంబే హైకోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది.
According to the govt, no document is conclusive proof of citizenship. By 2030, only one document will be proof of citizenship: https://t.co/9aCK7NAwDq pic.twitter.com/4BtDT8sY8E
— Asaduddin Owaisi (@asadowaisi) June 25, 2026