రాష్ట్రంలో అకాల వర్షాలు ఈదురు గాలుల ధాటికి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల వద్ద వేల క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోతుంటే ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. రైతులు కళ్ళముందే పంట నీళ్లపాలవుతుంటే కన్నీరు పెడుతున్నారని వారి కష్టానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రైతుల ఆరుగాలం కష్టం నిర్లక్ష్యం కారణంగా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వమే నిధులు చెల్లిస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. సుతిలీతాడు దబ్బడం రవాణా ఛార్జీలతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తున్నప్పుడు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. వడ్లను కొనుగోలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కమీషన్ కూడా ఇస్తోందని ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారని ధ్వజమెత్తారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దుర్మార్గమని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేవలం ఢిల్లీ పర్యటనల మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని మండిపడ్డారు. రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం కనీస మద్దతు ధరకు కొనాలని రైతులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. మంత్రులు వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
యాసంగి సీజన్ ముగుస్తున్నా కొనుగోళ్లు మందకొడిగా సాగడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ప్రభుత్వం తన మొండివైఖరిని వీడాలని హెచ్చరించారు.
ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు