Rahul Gandhi: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (UPI) లావాదేవీలపై పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుండటం కలకలం రేపుతోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పొడిచే నిశ్శబ్ద చర్య అని విమర్శించారు.
యూపీఐ ఛార్జీల వెనుక అసలు నిజం
ప్రభుత్వం ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, రూ. 2,000 దాటిన వ్యాపార యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించేందుకు మార్గం సుగమమైంది. సంఖ్యాపరంగా ఈ లావాదేవీలు కేవలం 5% మాత్రమే అయినప్పటికీ.. మొత్తం యూపీఐ లావాదేవీల ఆర్థిక విలువలో వీటి వాటా ఏకంగా 65% వరకు ఉండటం గమనార్హం. పరిమాణంలో చిన్నదిగా అనిపించినా, విలువల పరంగా ఇది చాలా పెద్దమొత్తంపై ప్రభావం చూపుతుంది.
వినియోగదారులపై పడే పరోక్ష భారం
వినియోగదారుల నుండి ఎలాంటి రుసుములు నేరుగా వసూలు చేయబోమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, అందులోని అసలు ముప్పు వ్యాపారులకు ఎదురవుతోంది. వ్యాపారులు తమపై పడే ఈ MDR భారాన్ని సొంతంగా భరించలేరు. ఫలితంగా, వారు వస్తువులు, సేవల ధరలను పెంచి ఆ రుసుమును పరోక్షంగా వినియోగదారుల నుంచే లాగుతారు. చివరికి ఈ అదనపు భారం నేరుగా సామాన్య ప్రజల జేబుల పైనే పడుతుంది.
అమెరికా ఒత్తిడికి లొంగుబాటు?
భారతదేశం విజయవంతంగా అమలు చేస్తున్న ‘జీరో-ఎండీఆర్’ (Zero-MDR) విధానాన్ని విదేశీ, ముఖ్యంగా అమెరికన్ పేమెంట్ కంపెనీలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. తమ పాత కార్డ్ చెల్లింపుల వ్యవస్థలకు ఇది ముప్పుగా భావించి, భారత్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. గతంలో వాణిజ్య ఒప్పందాల విషయంలో జరిగినట్లే, ఇప్పుడు ప్రధాని మోదీ అమెరికన్ దిగ్గజ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి ఈ విధాన మార్పుకు బాటలు పరిచారనే బలమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!