Veer Bal Diwas 2025: పసి ప్రాయంలోనే మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించిన బాబా జోరావర్ సింగ్ , బాబా ఫతే సింగ్ల బలిదానం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. సిక్కుల పదో గురువు, గురు గోవింద్ సింగ్ గారి ఈ ఇద్దరు చిన్న కుమారులు (ఛోటే సాహిబ్జాదే) చూపిన సాహసం, మన గుండెల్లో స్ఫూర్తిని రగిలిస్తుంది. చరిత్ర పుటల్లో ఎన్నో త్యాగాలు లిఖించబడి ఉన్నాయి. కానీ వీరి బలిదానానికి సాటి వచ్చే ఘట్టం మానవ చరిత్రలోనే మరొకటి కనిపించదు. కేవలం 7 , 9 ఏళ్ల ప్రాయం.. ఆటపాటలతో గడపాల్సిన ఆ పసి వయసులో, మరణం కళ్లముందు కనిపిస్తున్నా చెరగని చిరునవ్వుతో ధర్మాన్ని కాపాడిన ఆ వీర కిశోరాలే బాబా జోరావర్ సింగ్ , బాబా ఫతే సింగ్. వీరి త్యాగాన్ని స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’ గా ప్రకటించింది.
అచంచలమైన ధర్మనిష్ఠ:
1704వ సంవత్సరంలో సర్హింద్ నవాబు వజీర్ ఖాన్ ఈ చిన్నారులను బంధించి, తన దర్బారులో ప్రవేశపెట్టాడు. ముస్లిం మతంలోకి మారితే రాజభోగాలు, సంపద ఇస్తామని ఆశ చూపాడు. నిరాకరిస్తే కఠినమైన శిక్షలు తప్పవని బెదిరించాడు. కానీ.. ఆ చిన్నారులు ఏమాత్రం బెదరలేదు. “మా తాతగారు గురు తేగ్ బహదూర్ గారే ధర్మం కోసం ప్రాణాలర్పించారు. మేము కూడా అదే బాటలో నడుస్తాం తప్ప మతం మారం” అని సింహ గర్జన చేశారు.
గోడలో సజీవంగా.. కదిలించే బలిదానం:
పిల్లల మొండితనాన్ని చూసి ఆగ్రహించిన మొఘల్ పాలకులు, వారిని సజీవంగా గోడలో పెట్టి ఇటుకలతో కట్టాలని ఆదేశించారు. ఇటుకల గోడ మెడ వరకు వస్తున్నా.. మరణం కళ్లముందు కనిపిస్తున్నా ఆ బాలురు ఏమాత్రం చలించలేదు. ధైర్యంగా తమ గురువులను స్మరిస్తూ. ధర్మ రక్షణ కోసం అమరులయ్యారు. అంతటి చిన్న వయసులో అపారమైన ధైర్యం, ధర్మం పట్ల అంకితభావం చూపడం ప్రపంచ చరిత్రలోనే అద్భుతం.
Also Read: ఆర్థిక సంస్కరణల ఆద్యుడికి ఘన నివాళి.. మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
దాచిపెట్టబడిన నిజమైన చరిత్ర:
దురదృష్టవశాత్తు..మన దేశాన్ని కాపాడటం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన ఇలాంటి వీరుల గాథలు దశాబ్దాల పాటు పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం పొందలేదు. విదేశీ ఆక్రమణదారుల చరిత్రకు ఇచ్చిన ప్రాధాన్యత, మన మట్టి వీరుల త్యాగాలకు దక్కలేదు. కానీ ఇప్పుడు ఆ మరుగున పడ్డ సత్యాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ త్యాగాలు కేవలం సిక్కు మతానికి మాత్రమే పరిమితం కావు.. ఇవి భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకలు.
పిల్లల బలిదానం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది: “ఎంతటి ఆపద వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా.. సత్యాన్ని, ధర్మాన్ని వీడకూడదు.” నేటి తరం పిల్లలకు ఇన్స్టాగ్రామ్ హీరోలు కాదు, ఇలాంటి నిజమైన వీర కిశోరాల చరిత్ర తెలియాలి. వీర్ బాల్ దివస్ సందర్భంగా ఆ చిన్నారుల సాహసానికి నివాళులు అర్పిస్తూ, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవం.