Manmohan Singh Death Anniversary: భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల పితామహుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా దేశం ఆయన సేవలను స్మరించుకుంది. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తుచేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేతలు, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఢిల్లీలో జరిగిన నివాళి కార్యక్రమంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) భావోద్వేగంతో తన సందేశాన్ని పంచుకున్నారు. మన్మోహన్ సింగ్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, ఆయన ఒక దార్శనికుడని కొనియాడారు. “తన దార్శనిక నాయకత్వం ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన మహనీయుడు ఆయన. అణగారిన వర్గాలు, పేదల కోసం ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారతదేశానికి ఒక కొత్త గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి” అని రాహుల్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ పాటించిన వినయం, అంకితభావం, నిజాయితీ ఎల్లప్పుడూ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని గుర్తుచేసుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. జాతి నిర్మాణంలో మన్మోహన్ సింగ్ చేసిన అపారమైన కృషిని కొనియాడారు. ఆయన ఒక పరివర్తన కలిగించే నాయకుడని, క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక మార్గాన్ని పునర్నిర్మించి, పట్టాలెక్కించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. “ఆర్థిక సంస్కరణల ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించారు. కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారు” అని ఖర్గే ప్రశంసించారు.
వినయం, సమగ్రత, అపార జ్ఞానానికి మారుపేరుగా నిలిచిన మన్మోహన్ సింగ్.. ఎంతో గౌరవంతో, కరుణతో ప్రభుత్వాన్ని నడిపించారని ఖర్గే గుర్తుచేశారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందేలా ఆయన చూశారని, అందరినీ కలుపుకుపోయే తత్వం ఆయన సొంతమని అన్నారు. ముఖ్యంగా ఆయన హయాంలో తీసుకువచ్చిన ‘హక్కుల ఆధారిత నమూనా’ ఆయన పాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన దార్శనికత వల్లే మనం నేడు బలమైన భారతదేశాన్ని చూస్తున్నామని, ఆయన నిజాయితీగల ప్రజా సేవ, శాశ్వత సంస్కరణల వారసత్వం భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని నివాళులర్పించారు.
Read Also:Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్లో ఆరుగురు!