West Bengal Exit Polls: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026కు సంబంధించి రెండో దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ప్రముఖ సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఫలితాల ప్రకారం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. బెంగాల్ గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ టీఎంసీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.
పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం, మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 177 నుంచి 187 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఓట్ల శాతం పరంగా చూస్తే టీఎంసీ 46.5 శాతం ఓట్లను కొల్లగొట్టేలా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ తన బలాన్ని పుంజుకున్నప్పటికీ, అధికార పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరుకోలేకపోయింది. భారతీయ జనతా పార్టీ (BJP) 41.5 శాతం ఓట్లతో 95 నుంచి 110 స్థానాల మధ్య పరిమితం కావచ్చని సర్వే సంస్థ అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ (Left), భారత జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీల పరిస్థితి ఈసారి కూడా దారుణంగా ఉంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, లెఫ్ట్ కూటమికి కేవలం 4.1 శాతం ఓట్లతో గరిష్టంగా ఒక స్థానం దక్కే అవకాశం ఉండగా, కాంగ్రెస్ పార్టీ 2.1 శాతం ఓట్లతో 1 నుంచి 3 స్థానాలకు పరిమితం కావచ్చు. ఇతర చిన్న పార్టీలైన బి.జి.పి.ఎం (BGPM) కి 0.7 శాతం ఓట్లతో 1 నుంచి 2 స్థానాలు, ఇతరులకు 0.5 శాతం ఓట్లతో ఒక స్థానం లభించే అవకాశం ఉంది.
ఏప్రిల్ 29, 2026న జరిగిన రెండో దశ పోలింగ్లో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్లో సుమారు 89.99 శాతం పోలింగ్ ట్రెండ్స్ కనిపించాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే, పూర్బా బర్థమాన్ జిల్లాలో అత్యధికంగా 92.46 శాతం ఓటింగ్ నమోదు కాగా, హుగ్లీలో 90.34 శాతం, నాడియాలో 90.28 శాతం ఓటింగ్ నమోదైంది. కోల్కతా సౌత్ జిల్లాలో అత్యల్పంగా 86.11 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంచనాలు ప్లస్ లేదా మైనస్ 3 శాతం మార్జిన్ ఆఫ్ ఎర్రర్తో విడుదల చేసినట్లు సర్వే సంస్థ పేర్కొంది.
Read Also: ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను.. ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్