Bengal Elections 2026: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఓ వైపు ఎగ్జిట్ పోల్స్.. మరోవైపు పెరిగిన పోలింగ్ శాతంతో పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పోలింగ్ పెరిగితే తమకు లాభమని విపక్షాలు భావిస్తున్నాయి. తాజాగా బెంగాల్లో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 92. 47 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. దీంతో అధికార పార్టీలో మరింత కలవరం మొదలైంది.
బెంగాల్లో అధికార పార్టీకి టెన్షన్.. రికార్డు స్థాయిలో 92 శాతం పైగా పోలింగ్
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. వాటికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కాకపోతే ఈసారి ఈ ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం అధికార పార్టీలను కలవరపెడుతున్నాయి. ఇక బెంగాల్ శాసనసభకు రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. దాదాపు 92.47 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 23న జరిగిన తొలి దశలో 93 శాతానిపైగా పోలింగ్ నమోదు అయ్యింది. బుధవారం జరిగిన రెండో విడత రాత్రి 8 గంటల సమయానికి దాదాపు 92 శాతం నమోదు అయ్యింది.రెండు దశల పోలింగ్ పరిశీలిస్తే ఓటింగ్ శాతం 92.47 గా ఉంది.
స్వాతంత్య్రం తర్వాత.. మే నాలుగు వరకు నేతలకు టెన్షన్ తప్పదా?
బెంగాల్లో 6.81 కోట్ల మంది ఓటర్లు ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2011లో బెంగాల్లో అత్యధిక పోలింగ్ శాతం 84.72 శాతం నమోదు అయ్యింది. తొలిసారి మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడంతో బెంగాల్ ఓటర్లకు ఎన్నికల సంఘం వందనం చేస్తుందన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.
ఏప్రిల్ 9న అస్సాం, పుదుచ్చేరి వరుసగా అత్యధికంగా 85.38 శాతం, 89.83 శాతం ఓటింగ్ శాతాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. ఓటింగ్ శాతం పెరగడం, బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ సంకేతాలతో మమతా ప్రభుత్వానికి టెన్షన్ మొదలైంది. వరుసగా మూడుసార్లు బెంగాల్ పీఠాన్ని అందుకున్న మమత, నాలుగోసారి జెండా ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నారు.
ALSO READ: బెంగళూరులో వరుణుడి బీభత్సం.. ఆసుపత్రి గోడ కూలి ఏడుగురు మృతి.. ముగ్గురు పసిపిల్లలు బలి!
దేశ రాజధాని ఢిల్లీలో బెంగాల్ ఎన్నిలకపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల నేతలు దీనిపై చర్చించుకున్నాయి. బీజేపీ కీలక నేతలు దీనిపై నోరు ఎత్తకపోయినా తమ సంస్థల ద్వారా సొంతంగా సర్వే చేసినట్టు తెలుస్తోంది. అందులో బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని వచ్చినట్టు అంతర్గత సమాచారం.