Delhi News: దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది? ఎందుకు ఫేమస్సయిన షాపింగ్ మాల్స్ని మూసివేసేందుకు సిద్ధమయ్యారు? అధికారులు కారణమా? షాపింగ్ మాల్స్ నష్టాల్లో ఉన్నాయా? దీపావళి ఫెస్టివల్కు ఆ మాల్స్ ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఢిల్లీలో ఫేమస్ షాపింగ్ మాల్స్ మూసివేత?
రాజధానిలో ఢిల్లీలో మొట్టమొదటిసారి ఆకర్షణీయమైన షాపింగ్ కేంద్రాలు, ప్రముఖులు, విదేశీ పర్యాటకులతో మూడు షాపింగ్ మాల్స్ ప్రసిద్ధి చెందాయి. అయితే ఆ మాల్స్ ఇప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల యాజమాన్యం తాత్కాలికంగా మూసివేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
దక్షిణ ఢిల్లీలోని వసంత్కుంజ్ ప్రాంతం గురించిన చెప్పనక్కర్లేదు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మూడు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. DLF ప్రొమెనేడ్, DLF ఎంపోరియో , యాంబియెన్స్ మాల్స్ నిత్యం సెలబ్రిటీలు, విదేశీ పర్యాటకులతో నిత్యం కళకళలాడేవి. కాకపోతే ఆ మూడు ఇప్పుడు గడ్డు సమస్య ఎదుర్కుంటున్నాయి. మూడు ప్రధాన షాపింగ్ మాల్స్ తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నారు.
పండుగ సీజన్ వేళ.. నీటి సమస్య
ఈ సమస్య కారణంగా మూసివేత అంచున ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం-జల్ బోర్డు రాబోయే రెండు, మూడు రోజుల్లో వాటికి నీటిని సరఫరా చేయడంలో విఫలమైతే మూసివేయాల్సి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే కోట్లాది రూపాయల వ్యాపారాలపై ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. వాటిని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముంది.
ఢిల్లీ జల్ బోర్డు నుండి వాటికి నీటి సరఫరా చేయడం చాలా రోజులుగా అంతరాయం ఏర్పడింది. షాపింగ్ మాల్స్లో ఏర్పాటు చేసిన ట్యాంకులు ఖాళీ అయ్యాయని మాల్స్ యాజమాన్యాలు చెబుతున్నారు. ఇప్పటికే పరిస్థితి చాలావరకు దిగజారిందని అంటున్నారు. వీటి కారణంగా దాదాపు 70 శాతం టాయిలెట్లు మూసివేశారు. రెస్టారెంట్లు, మాల్స్ ప్రాథమిక పరిశుభ్రత కార్యకలాపాలను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నాయి.
ALSO READ: కరూర్ ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం
రెస్టారెంట్లు పాత్రలు కడగడం నుండి వినియోగదారులకు తాగు నీటిని అందించడం వరకు చాలావరకు తమ సేవలను తగ్గించుకోవాల్సి వచ్చిందని మాల్ లోని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపాడు. వాటిని శుభ్రం చేయడానికి మాకు తగినంత నీరు లేదన్నాడు. ఇలాంటి పరిస్థితులలో కస్టమర్లకు సరిగ్గా సేవ చేయడం అసాధ్యమని చెబుతున్నాడు.
రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో నీటి సరఫరా పునరుద్ధరించకపోతే కార్యకలాపాలను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. నీటి సరఫరా ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనే దానిపై ఢిల్లీ జల్ బోర్డు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. తక్షణ చర్యలు తీసుకోకపోతే సంక్షోభం మరింత తీవ్రమవుతుందని మాల్స్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఈ మాల్స్ ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడేవి. ఇటీవల ప్రభుత్వం ట్యాంకర్ నీటిపై నిషేధం విధించింది. దీంతో షాపింగ్ మాల్స్కు తీవ్రకష్టాలు వచ్చిపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీటి సరఫరా త్వరగా పునరుద్ధరించకపోతే అన్ని కార్యకలాపాలు నిలిచిపోవచ్చని అంటున్నారు మాల్స్ నిర్వాహకులు.
కేవలం మాల్స్ మాత్రమే కాకుండా ప్రైవేట్ ప్రీమియం హోటళ్లు, ఎయిర్టెల్, మారుతి సుజుకి, ఓఎన్జీసీ వంటి ప్రధాన కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. షాపుల యాజమానులు ప్రభుత్వం-సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ 2008లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ హయాంలో అభివృద్ధి జరిగింది. అత్యంత ఉన్నత స్థాయి ప్రాంతాల్లో దీన్ని కూడా ఒకటి.