పొలిటికల్ పార్టీల నేతలు సాధారణ భాషలో మాట్లాడుకోవడం బంద్ చేసినట్టు ఉన్నారు. ఎందుకంటే ఇంతకాలం విమర్శలు మాటల రూపంలో ఉండేవి. కానీ ఇప్పుడు బూతుల రూపంలోకి మారాయి. జనరేషన్ మారితే బెటర్ పాలిటిక్స్ చేస్తారని అంతా భావిస్తే అందుకు భిన్నంగా అధ్వాన్నంగా రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పొద్దున లేస్తే తిట్టకపోతే రోజు గడవదని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ రోజుల్లో ఎంత బాగా తిడితే ఆ నాయకుడికి అంత మాస్ ఫాలోయింగ్ వస్తుందని కొందరు అంటున్నారు. గతంలో కేసీఆర్ తిడితేనే మాస్ లీడర్ అయ్యారని.. ఆయన తర్వాత అంత బాగా తిట్టినందునే రేవంత్ రెడ్డి సైతం సీఎం అయ్యారని సోషల్ మీడియాలో కొందరు చర్చకు తెరలేపారు. అదే ట్రెండ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాలో అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ప్రజలు గుర్తుపెట్టాలంటే కేవలం మాటలు చెబితే సరిపోదు. తమను అసెంబ్లీకి పంపించిన ప్రజల కోసం అంతో కొంత అభివృద్ధి చేయాలి. కనీస మౌలిక వసతులు అయినా కల్పించాలి. అదేమీ లేకుండా తమ సమస్యలు తీర్చాలని కోరే ప్రజలకు దూరంగా ఉంటూ ఇదంతా అధికార పార్టీ వైఫల్యం, తమకు నిధులు ఇవ్వడం లేదు.. అభివృద్ధి ఎలా చేయాలని ప్రజల మీద రివర్స్ అయితే ఎలా ఉంటుంది. దీనికి తోడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. మీరు చేయాల్సిన పనిని పక్కనబెట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇష్టానుసారంగా బూతులు తిడితే ఏం వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతుసమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వ పెద్దలతో చర్చించాలి.
గతంలో చంద్రబాబు, వైఎస్సార్ హయాంలో పాలిటిక్స్ చాలా బాధ్యతాయుతంగా, హుందాగా ఉండేవి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్..ఎటువంటి అమానకరమైన, అసభ్య పదజాలం ఉపయోగించడకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. నేరుగా సీఎంతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపేవారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో ప్రజా, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవారు. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక.. రాజకీయ విమర్శలు కాస్త హద్దు మీరాయి. బూతులే అస్త్రాలుగా కేసీఆర్ రెచ్చిపోయారు. ప్రజలు సైతం వాటికి అలవాటుపడిపోయారు.కేసీఆర్ ప్రతిపక్షాలపై బూతులతో ఎదురుదాడికి దిగితే ప్రజలు సైతం ఎంజాయ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.
బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎమ్మెల్యే బండారు శ్రావణికి కార్యకర్త సవాల్
కేసీఆర్ వారసత్వాన్ని తాజాగా కేటీఆర్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇలాగే పరుష వ్యాఖ్యలు, పలుమార్లు బూతు విమర్శలు చేశారు. వాటిని ప్రజలు సైతం ఎంజాయ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు ఇలాంటి బూతు విమర్శలు జనాలకు కూడా కామన్ అయిపోయింది. అందుకే ఎవరు ఎక్కువ మాట్లాడితే వారికే మాస్ ఫాలోయింగ్ పెరిగి అధికారం వస్తుందని కలలుకంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా రైతు సంగ్రామ సభలో .. ‘అరె హౌలే, దివానే’ అంటూ సీఎం రేవంత్ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ లీడర్స్ బాధ్యతగా మాట్లాడాలని.. వీరిని చూసి మరికొందరు అనుకరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.భాష మార్చుకోని పద్ధతిగా విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.