ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసేందుకు రెడీ అయ్యాయి. దీని కోసం జరుగుతున్న భూసేకరణను అడ్డుకునేందుకు ఐక్య ఉద్యమాలు చేసి..సర్కార్ చర్యలను అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. చాపకింద నీరులా దీనిపై వస్తున్న ప్రజా ఆందోళనలను బేస్ చేసుకుని బాధితులతో కలిసి బలమైన ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణను రెడీ చేసుకుంటున్నాయి. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రజాసంఘాలన్నీ భేటీ అయ్యాయి.
అక్రమంగా పేదలు, రైతుల నుంచి భూసేకరణ పేరుతో సర్కార్ దమనకాండకు పాల్పడుతుందని మండిపడుతున్నారు. అక్రమంగా అప్పుడు బీఆరెస్ సర్కార్ తీసుకొచ్చిన 2017 భూ సేకరణ చట్టాన్నే ఇప్పడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని విమర్శిస్తున్నారు. ఈ ప్రజాసంఘాల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు టీఆర్ఎస్ చీఫ్ కవిత, బీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, కన్నెగంటి రవి, వివిధ మహిళా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొని.. ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారా దీనికి పరిష్కారం దొరుకుతుందని నిర్ణయానికి వచ్చాయి.
కేసీఆర్ పాలనలో ఫార్మాసిటీ పేరుతో 13వందల ఎకరాలను సేకరించే పనికి పూనుకుంటే.. ఇప్పుడు దీనికి పేరు మార్చి.. చుట్టూ ఉన్న గ్రామాలను కూడా కలుపుకుని మొత్తం 30 వేల ఎకరాలను బలవంతంగా సేకరించి పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నాడని వీరి ప్రధాన ఆరోపణగా ఉంది.
అసైన్డ్ భూములే కాకుండా, పట్టా భూములను కూడా బలవంతంగా లాక్కుని పేదవారిని మరింత పేదవారిగా చేసే కుట్రే తప్ప.. అక్కడ ఉద్యోగాల కల్పన లేదు.. దానిపై ఎలాంటి హామీ కూడా లేదని మండిపడుతున్నారు. ఇప్పటి దాకా ఫ్యూచర్ సిటీలో ఒక్క కంపెనీ కూడా వచ్చింది లేదని, ఉపాధి అవకాశాల కల్పనా లేదని విమర్శిస్తున్నారు. బీఆరెస్ హయాంలో కొనసాగిన భూదందానే కాంగ్రెస్ సర్కార్ కూడా కొనసాగిస్తున్నదని ఆరోపిస్తున్నారు. వెలుగుమట్ల బాధితుల పక్షాన పోరాడినట్టుగానే.. ఫార్మాసిటీ భూసేకరణపై పోరాటం చేయాలని భావిస్తున్నారు.
కేవలం ఆందోళన చేయడం కాదని, అక్కడే ఉండి.. పరిష్కారం లభించేంత వరకు ఆందోళలనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఈ వేదికగా. ఓ వైపు సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కానీ మరోవైపు ప్రజా సంఘాలు బాధితులతో కలిసి భూ పోరాటాలకు సిద్దమయ్యాయి. ఇది పార్టీలకతీతంగా నిర్వహించాలని, బాధితుల, రైతుల తరుపున పోరాడే ఏ పార్టీ అయినా తమతో జాయిన్ కావొచ్చనే పిలుపునిచ్చారు వక్తలు.