మాజీసీఎం, గులాబీబాస్ కేసీఆర్ వ్యవహారశైలిపై అన్నదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తాను రైతు పక్షపాతిని అని..వారి కష్టాలు తీర్చేందుకు రైతుబంధు, రుణమాఫీ చేశానని చెప్పుకొచ్చిన కేసీఆర్.. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలిసి కూడా ఎందుకు బయటకు రావడం లేదని.. రేవంత్ సర్కారును ఎందుకు ప్రశ్నించడం లేదని వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. గతంలో రైతులకు తాను ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదని, బీఆర్ఎస్ హయాంలో యూరిత కొరత రాకుండా చూసుకున్నానని.. సకాలంలో రుణమాఫీ, రైతుబంధు ఒకేసారి ఇచ్చానని ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రకటించారు. దాదాపు గంటపాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
యాసంగి సీజన్ ధాన్యం కోతలు అయిపోయి కళ్లాల్లో రాశులు కుప్పలుగా పోసి ఉన్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పలుగా పోసి వారం రోజులు అయినా కంటా పెట్టడం లేదని వాపోతున్నారు. మరోవైపు ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. దీనికి తోడు అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కుప్పలు కొట్టుకుపోవడం, తడిచి ముద్దవుతున్నాయి. దీంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. త్వరగా ధాన్యం కొనాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.అయితే, రేవంత్ సర్కార్ మాత్రం ధాన్యం కొంటామని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని తెలుస్తున్నది.
రెండ్రోజుల కిందట కురిసిన వర్షాలకు గాను గోడ కూలి నలుగురు, సెంట్రింగ్ బాక్స్ మీద పడి ఒకరు మృతి చెందారు. అలాగే ధాన్యం కొనుగోలు చేయడం లేదని మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటివరకు సుమారు 8 మంది రైతుల ప్రాణాలు పోయినట్టు సమాచారం. ఓవైపు ఆత్మహత్యలు పెరుగుతుంటే రేవంత్ సర్కారు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గొంతెత్తినా పెద్దగా చర్యలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రైతులు గులాబీ బాస్ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సభకు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ వస్తారని అంతా భావించారు. కానీ, ఆయన రాలేదు. దీంతో రైతులు నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తున్నది.
KTR : కేటీఆర్ సారూ ఆ భాషేంది.. జరమార్చుకోరాదు!
ఈ సమయంలో కేసీఆర్ బయటకు వస్తే రైతుల సమస్యలు తీరుతాయని గులాబీ కేడర్ సైతం భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే గతంలో కేసీఆర్ బయటకు వస్తున్నారంటే రైతుభరోసా, రైతుబంధు వేశారని రైతులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సైతం రేవంత్ సందర్శించి త్వరగా రిపేర్లు చేపట్టాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గులాబీ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేసీఆర్ బయటకు రాకపోయినా.. కనీసం ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల సమస్యలు, ఆత్మహత్యలపై ప్రభత్వాన్ని ప్రశ్నించాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను రైతు పక్షపాతి అని చెప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు కూడా స్పందించకపోతే ఇదంతా ఉత్తదే అని.. పేరుకే చెప్పుకుంటారని విమర్శలు వెల్లువెత్తే అావకాశం లేకపోలేదని తెలుస్తోంది.