Jabalpur: మంచి ఆలోచనలు.. కష్టపడే తత్వం.. ఉండాలేగానీ మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని నిరూపించారు పైన కనిపిస్తున్న మహిళ. ఉన్నతమైన చదువులు చదువుకున్న మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగం చేశారు. అవేమీ ఆమెకి సంతృప్తి ఇవ్వలేదు. సొంతూరికి వచ్చేసి చేపల వ్యాపారం మొదలుపెట్టారు.. అందులో సక్సెస్ అయ్యారు. ఏటా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న మహిళ ఎవరోకాదు భవాని ఝా.
ఐటీ ఉద్యోగానికి జబల్పూర్ భవానీ ఝా గుడ్ బై
ఈ మధ్యకాలంలో టెక్కీలు రూటు మార్చారు. గంటల తరబడి ఆఫీసుల్లో గడపడం వారికి బోరు కొట్టేసింది. కొత్త కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. టెక్నాలజీ యుగంలో తమకున్న ఆలోచనలో కొత్త కొత్త దారులు వెతుకున్నారు సక్సెస్ అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ జాబితాలోకి భవానీ ఝా కూడా చేరిపోయారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన భవానీ ఝా 2007లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. హైదరాబాద్లో రెండేళ్లు ఎంఎన్సీ కంపెనీలో ఐటీ ఉద్యోగం చేశారు. సంపాదన కూడా ఎక్కువగా ఉండేది. అవేమీ ఆమెకి సంతృప్తి ఇవ్వలేదు. నలుగురి దగ్గర పని చేయడం కాదు.. నలుగురుకి ఉపాధి కల్పించాలని డిసైడ్ అయ్యారు.
వివాహం తర్వాత సొంతూరు జబల్పూర్కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కోచింగ్ సెంటర్ ప్రారంభించారు కానీ కొవిడ్ విజృంభణతో మూతపడింది. చివరకు చేపల పెంపకంపై ఫోకస్ చేశారు. ఏ మాత్రం అనుభవం లేకుండా సవాల్గా స్వీకరించారు. జబల్పూర్కు 15 కిలోమీటర్ల దూరంలోని హినోటియా గ్రామంలో నాలుగున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
సొంతంగా చేవల పెంపకంలోకి అడుగు.. ఏడాదికి లక్షల్లో ఆదాయం
చేపల పెంపకంపై ప్రాథమిక శిక్షణ పొందింది. ఈ విషయంలో ఆమె భర్త అయిష్టంగా ఉన్నప్పటికీ అత్యంత సవాలుతో కూడిన చేపల పెంపకాన్ని ఎంపికను ఎంచుకుంది. భూమి పాడవ్వకుండా టెక్నాలజీ పరిజ్ఞానంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి చేపల పెంపకంలోకి అడుపెట్టారు.
భువనేశ్వర్లోని సెంట్రల్ ఫ్రెష్వాటర్ అక్వాటిక్స్ ఇన్స్టిట్యూట్, ముంబైలోని సెంట్రల్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్లలో శిక్షణ పొందింది. ఈ విభాగంలోకి దిగిన వెంటనే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరకు జబల్పూర్లోని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి అనేక పథకాల కింద గ్రాంట్ల రూపంలో ఆమెకు మద్దతు లభించింది.
పాలిథీన్ షీట్తో లైనింగ్ వేసే అత్యాధునిక విధానాన్ని అనుసరించారు. ఖరీదైన పంగాసియస్ చేపల పెంపకం మొదలుపెట్టారు. ఈ పద్ధతి కాస్త ఖరీదైనది, చదరపు మీటరుకు రూ. 100 వరకు అయ్యింది. చేపల పెంపకం పద్ధతికి రెడీమేడ్ ఫీడ్ అవసరం కావడంతో పొరుగునున్న ఛత్తీస్గఢ్ నుండి తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసేవారు.
ALSO READ: ఢిల్లీలో బాంబు కలకలం.. పాఠశాలలకు బెదిరింపులు
ప్రస్తుతం ఆమెకు ఆరు చెరువులు ఉన్నాయి. ఏటా 20-30 టన్నుల చేపలు దిగబడి వచ్చేది. కిలోకు రూ. 120 వరకు అమ్మడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వ్యాపారులు ఆమె వద్దకు వచ్చిన వాటిని కొనుగోలుదారులు చేస్తున్నారు. మిగిలిన భూమిలో మరిన్ని చెరువులను అభివృద్ధి చేయాలన్నది ఆమె కోరిక. దీనివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.