Telugu horror thriller: కొంతమంది దెయ్యాలు, భూతాలు ఒట్టి మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తుంటారు. కానీ ఓటీటీలో అలాంటి సినిమాలు వస్తే మాత్రం వదలకుండా చూస్తారు. ఇదే ఏడాది థియేటర్లలో విడుదలైన ఏ రేటెడ్ హర్రర్ మూవీ Eesha, దాదాపు 6 నెలల తరువాత ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఈ ఆరు నెలల్లో రెండు సార్లు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.
కళ్యాణ్, నైనా ఈ సినిమాలో మన హీరో హీరోయిన్. వీళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లిద్దరే ఆదిత్ అరుణ్, సిరి హన్మంతు. సైంటిఫిక్ గా ఆలోచించే ఈ నలుగురు ప్రాణస్నేహితులు. కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సమాజంలో దేవుడి పేరుతో, ఆత్మల పేరుతో ప్రజలను మోసం చేసే నకిలీ బాబాలను, మంత్రగాళ్లను గుడ్డిగా నమ్మకూడదని వాళ్ళు బలంగా నమ్ముతారు. మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఒక ఇన్వెస్టిగేటివ్ మిషన్ను ప్రారంభిస్తారు.
ఈ క్రమంలో సమాజంలో బాగా పాపులర్ అయిన ఒక పవర్ ఫుల్, ఆధ్యాత్మిక బాబాను కలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఫేక్ బాబా. దెయ్యాలు, ఆత్మలు అనేవి కేవలం భ్రమ మాత్రమేనని, వాటికి ఎలాంటి ఉనికి లేదని ఆ బాబాతో వాదిస్తారు. దాంతో ఆ బాబా వారికి ఒక ఛాలెంజ్ విసురుతాడు. నమ్మకం లేని వాళ్ళు రాత్రిపూట ఒక పాడుబడిన భవనంలో గడపగలరా? అని అడుగుతాడు. ఆ ఛాలెంజ్ ను ఈ నలుగురు ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయడమే కాదు, ఆ పాడుబడిన ఇంట్లోకి రాత్రి పూట ఎంట్రీ కూడా ఇస్తారు.
అక్కడ దెయ్యాలు లేవని నిరూపించడమే వాళ్ళ టార్గెట్. కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన కొద్దిసేపటికే వింత సంఘటనలు జరుగుతాయి. ఊహించని విధంగా ఆ ఇంటి తలుపులన్నీ లాక్ అయిపోతాయి. బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఆ భయంకరమైన ఇంట్లో బందీలుగా మిగిలిపోతారు. ఆ చీకటి గదులలో ఒక్కొక్కటిగా అంతుచిక్కని విచిత్రమైన సంఘటనలు జరగడం షురూ అవుతుంది. గాలిలో వస్తువులు కదలడం, వింత శబ్దాలు రావడం, భయపెట్టే నీడలు కనిపించడం… ఇవన్నీ వాళ్ళను పిచ్చివాళ్లను చేస్తాయి. ఆ గదిలోని క్లోజ్డ్ అట్మాస్ఫియర్ వారిని ఒకరినొకరు అనుమానించుకునే స్థాయికి తీసుకెళ్తుంది. మరి ఆ నరకం నుండి ఆ నలుగురు స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డారా ? అనేదే మూవీ క్లైమాక్స్.
హారర్ థ్రిల్లర్ జానర్లోవచ్చి తెలుగు సినిమా ప్రేమికులను అలరించిన చిత్రం ‘ఈషా’. హిందీ వెర్షన్లో ISHAగా విడుదలైంది. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రం Amazon Prime Videoలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంతు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమా చాలా రోజుల క్రితమే విడుదలైంది. కానీ తాజాగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ షురూ అవ్వడంతో, ఈ మూవీ మరోసారి ట్రెండ్ అవుతోంది.
Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్