ఆ ఇద్దరు వైశ్యులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే. ఒకరు తాజా ఎమ్మెల్యే. పదేండ్ల పాటు బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన బిగాల గణేశ్ గుప్తా.. బీజేపీ నుంచి మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా! ఇందూరు వేదికగా ఈ ఇద్దరి సేట్ల సిగపట్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెర తీశాయి. బీఆరెస్ ఆధ్వర్యంలో తను చేసిన అభివృద్దిని కాపాడలేకపోతున్నాడని,వాటిని నామరూపాల్లేకుండా చేస్తున్నాడని బిగాల ఆరోపిస్తున్నాడు. మినీ ట్యాంక్ బండ్ను మెయింటేన్ చేసే సత్తా కూడా లేక .. నిజామాబాద్కు ఉన్న ఒకే ఒక్క ఆహ్లాదకరమైన పార్క్ను మెయింటేన్ చేయలేక .. దాన్ని బంద్ పెట్టిస్తున్నాడనేది ఇందూరు బీఆరెస్ నేతల ఆరోపణ.
నగరంలో ఆహ్లాదకరంగా పెంచిన చెట్లకు, మొక్కలకు నీరు కూడా పోయకుండా వాటిని ఎండబెట్టిన ఘనత ధన్పాల్కే దక్కుతుందని బిగాల ఆరోపణలు చేస్తున్నాడు. నిరసనలకు దిగాడు. బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ఇంత వరకు ఒక్క అభివృద్ధి కూడా నగరంలో జరగలేదనేది వారి ఆరోపణ. దీనిపై ధన్పాల్ కూడా తీవ్రంగానే స్పందించాడు. సవాల్ విసిరాడు. అవినీతికి ఆలవాలంగా మారిన పదేండ్ల బీఆరెస్ పాలనలో గణేశ్ గుప్తా దోచుకున్నది, అవినీతికి పాల్పడింది వందల కోట్లకు పైగా ఉంటుందని ఆరోపించారు. తన అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టి.. నగరాన్ని అభివృద్ధి మాటున విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు.
కావాలంటే చర్చకు సిద్దమని, నగరంలోని ప్రముఖ గణపతి దేవాలయం వద్ద ఇద్దరం చర్చకు కూర్చుందామని సవాల్ విసిరాడు. నీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. అన్నింటా దోపిడేనని, ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పించిన పాపాన పోలేదని, ఒక్క కొత్త పింఛను, కొత్త రేషన్కార్డు కూడా ఇప్పించలేకపోయాడని ధన్పాల్ తీవ్రంగా విమర్శించాడు. తాను ఈ రెండున్నరేండ్లలో ఏ చిన్న అవినీతికి పాల్పడినట్టు నిరూపించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు.. ఇకపై శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా శపథం చేశాడు ధన్పాల్.
ఇప్పుడు ఈ ఇద్దరి ఖద్దరు సేట్ల పంచాయతీ రచ్చకెక్కింది. ఒకరు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి.. నగరానికి ఏం చేయలేకపోతున్నారనేది వాస్తవం. అంతకు ముందు పదేండ్ల పాలనలో బిగాల చేసిన అవినీతి మరెక్కడా జరగలేదనే ఆరోపణను పూర్తిగా కొట్టిపారేయలేం. ఇప్పుడీ ఇద్దరు సేట్లకు మళ్లీ ఆ పార్టీలు టికెట్లు ఇస్తాయా లేదా అనేది కూడా డౌటే. కానీ ఇద్దరు బస్తీమే సవాల్ అని కొట్లాడుకుంటున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ఎవరి రాజకీయాలు వారికున్నాయి. మధ్యలో ఈ డైవర్షన్ పాలిటిక్స్తో కాంగ్రెస్కు మేలు జరుగుతున్నది.