కేసీఆర్ పదేళ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. దీన్ని పార్టీలకతీతంగా ఎవరూ కాదనలేరు. కానీ వాటికి అవినీతి మరకలు అంటుకోవడం వల్లే అతనికి రావాల్సిన పేరు రాలేదు. పరిపాలనలో తనదైన మార్కు వేసుకునే క్రమంలో మొండిగా పోయిన సందర్బంలో.. కొన్ని మంచిపేరును తెచ్చిపెడితే.. కొన్ని మాయని మచ్చగా మిగిలాయి.
ఆ పదేళ్ల పాలనపై ఇప్పుడు అంత లోతుగా పోవడం లేదు గానీ.. అమరజ్యోతి గురించి చెప్పుకోవడంలో భాగంగానే ఈ ఇంట్రడక్షన్. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరాన నిర్మించిన అద్భుతమైన కట్టడమే ఈ అమరుల స్మృతివనం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మారకంగా ఏర్పాటు చేయబడిన చిహ్నం.పైన వెలుగుతున్న దీపం ఆకారంలో అందరినీ ఆకట్టుకుని నగరానికే కొత్త శోభను సంతరించిపెట్టింది.
ఇప్పుడు దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకంటే.. కేసీఆర్ .పాలనలో దీన్ని నిర్మించినా.. ఒక్కసారి కూడా ఇందులో సమావేశాలు జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. అదీ రేవంత్ సర్కార్ పాలనలో. అంటే అప్పుడు దీన్ని పట్టించుకున్నవారే లేరు. కట్టారు. వదిలేశారు. దీని కోసం అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దాదాపు 70 కోట్లు ఖర్చు చేయాలని అంచనాలు పెట్టుకున్నా.. ఇది అమాంతం పెరిగి 130 కోట్లదాకా పోయిందంటారు. ఇందులో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈవిషయం పక్కనపెడితే .. మొదటిసారిగా దీన్ని మీటింగుల కోసం వినియోగించుకుంటున్న సందర్భంలో ఉద్యమకారులు.. దీన్ని నిర్మించిన తీరును చూసి అవాక్కవుతున్నారట. ఈ అద్బుత కట్టడం చూసి అచ్చెరువొందుతున్నారంట. అబ్బ ఎంత బాగా కట్టారు. పాపం.. కేసీఆర్ ఎంతో చేశాడు. కానీ చేయాల్సినవి చేయలేదు. ఉద్యమకారులను పట్టించుకోలేదని సానుభూతి తోడైన వ్యాఖ్యలతో పాటు తమను విస్మరించాడనే అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఆనాటి ఉద్యమ గురుతులను యాది చేసుకుంటున్నారట.
కారణం.. అక్కడ కేకే కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో నిత్యం మీటింగులు నడుస్తున్నాయి. దాదాపు వెయ్యి మంది వరకు అక్కడ మీటింగు ఏర్పాటు చేసుకునేలా ఏర్పాట్లు, మ్యూజియం, ఫోటో గ్యాలరీ, వెయ్యి మంది కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ సిస్టమ్.. ఇవన్నీ అద్భుతమైన నిర్మాణాలుగా వారు కీర్తిస్తున్నారు.
కేసీఆర్ గుర్తించకున్నా.. రేవంత్ సర్కార్ కనీసం ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏదో చేద్దామనే తలంపుతో ఏర్పాటు చేసిన కేకే కమిటీ పట్ల ఆశాభావం చూపుతూనే.. ఆయన నిర్మించిన అమరజ్యోతిలో సంక్షేమంపై మీటింగులు జరగడం ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం.