Electricity Saving Tips: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగలకు తట్టుకోలేక ఇళ్లల్లోని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ప్రజలు విరామం లేకుండా వాడేస్తున్నారు. దీంతో నెలాఖరున వచ్చే విద్యుత్ బిల్లును చూసి వారు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. అయితే ఓ వైపు పర్యావరణాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు మన జేబుకు చిల్లు పడకుండా చూసుకునే 5 అద్భుతమైన పర్యావరణ హిత (Eco-friendly) అలవాట్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. దీనిని పాటించడం ద్వారా విద్యుత్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలామంది ఏసీ ఆన్ చేయగానే గది త్వరగా చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేస్తుంటారు. దీనివల్ల కంప్రెషర్ ఎక్కువ సమయం పనిచేసి విద్యుత్ విపరీతంగా ఖర్చవుతుంది. బదులుగా ఏసీ ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ 24 డిగ్రీల నుండి 26°C మధ్య ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొంటున్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో కిటికీల గుండా వేడి గాలులు, సూర్యరశ్మి ఇళ్లలోకి రాకుండా చూడాలి. ఇందుకోసం మందపాటి తెరలు (Curtains) లేదా బ్లైండ్స్ ఉపయోగించండం మంచిది. ఇళ్లలోకి నేరుగా ఎండ పడకపోతే గది ఉష్ణోగ్రత సహజంగానే కొన్ని డిగ్రీలు తగ్గుతుంది. దీనివల్ల ఏసీ, కూలర్లపై లోడ్ తగ్గుతుంది. ఇక సాయంత్రం కాగానే కిటికీలన్నీ తెరిచి ఉంచితే.. చల్లని గాలి లోపలికి వచ్చి ఇల్లు త్వరగా చల్లబడుతుంది.
కొందరు టీవీ, ల్యాప్టాప్, చార్జర్లు, మైక్రోవేవ్ ఓవెన్ వంటి పరికరాలను రిమోట్తో ఆఫ్ చేసి.. మెయిన్ స్విచ్లు ఆన్ లోనే ఉంచేస్తుంటారు. పరికరాలను వాడనప్పటికీ కూడా అవి కొంత విద్యుత్ను నిరంతరం లాగుతూనే ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఉపయోగించని ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా ప్లగ్ తీసేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది నెలాఖరులో మీ బిల్లుపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుందని తెలియజేస్తున్నారు.
పాతకాలపు ట్యూబ్లైట్లు, పసుపు రంగు బల్బులు వాడుతుంటే వెంటనే వాటిని మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాత ఫ్యాన్ల స్థానంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న BLDC ఫ్యాన్లను అమర్చుకోవడం బెస్ట్ అని సలహా ఇస్తున్నారు. ఎల్ఈడీ బల్బులు తక్కువ విద్యుత్ను వినియోగించుకోవడమే కాకుండా వేడిని అస్సలు పుట్టించవు. అలాగే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు సాధారణంగా వాటికంటే 30 నుంచి 50 శాతం తక్కువ కరెంట్ ను వాడుకుంటాయి.
Also Read: మీ పాత ఫోన్ను.. సూపర్ ఫాస్ట్గా మార్చేసే.. అద్భుతమైన ‘స్మార్ట్’ చిట్కాలు!
ఎండకాలంలో మధ్యాహ్నం పూట గ్యాస్ స్టవ్, ఓవెన్ వంటివి ఎక్కువ సమయం వాడితే ఇల్లు మరింత వేడెక్కుతుంది. కాబట్టి వంటను ఉదయాన్నే లేదా సాయంత్రం చల్లబడ్డాక పూర్తి చేయడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బాల్కనీల్లో, కిటికీల దగ్గర ఇండోర్ ప్లాంట్స్ పెంచాలని హితవు పలుకుతున్నారు. ఇలా చేస్తే మొక్కలు గాలిని శుభ్రపరిచి.. ఇళ్లలో తేమ శాతాన్ని సమతుల్యంగా ఉంచి సహజమైన చల్లదనాన్ని అందిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
Also Read: ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. బట్టలు బాగా ఉతికేది ఏది? ఇంటికి ఏ వాషింగ్ మిషన్ బెస్ట్?