Hyderabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీ డ్రగ్స్ రవాణాకు వేదికైంది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఎవరికీ అనుమానం రాకుండా లగేజీ బ్యాగుల్లో డ్రగ్స్ దాచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, పక్కా సమాచారంతో నిఘా ఉంచిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీలు చేపట్టి, వారి వద్ద ఉన్న భారీ గంజాయి నిల్వలను బయటపెట్టారు.
నిందితుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు వాటర్ బాటిల్స్, ఆలూ చిప్స్ ప్యాకెట్లు, కొన్ని రకాల డబ్బాలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా లోపల అత్యంత ఖరీదైన ‘హైడ్రోఫోనికల్ గంజాయి’ బయటపడింది. మొత్తం 24 ప్యాకెట్లలో దాచిన ఈ గంజాయి బరువు సుమారు 8.705 కిలోలుగా అధికారులు తేల్చారు. సాధారణ గంజాయితో పోలిస్తే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో, పట్టుబడిన సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 3.05 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
సాధారణంగా మట్టి లేకుండా కేవలం ప్రత్యేక పోషకాలతో కూడిన నీటిలోనే ఇండోర్ పద్ధతిలో ఈ హైడ్రోఫోనిక్ గంజాయిని సాగు చేస్తారు. దీని తీవ్రత, కిక్ చాలా ఎక్కువగా ఉండటం వల్లే దీనికింత డిమాండ్. ప్రస్తుతం అధికారులు ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్లో ఈ డ్రగ్స్ ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో డీఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు!
వాటర్ బాటిల్స్లో రూ.3కోట్ల గంజాయి
శంషాబాద్ విమానాశ్రయంలో హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లగేజీలో అనుమానాస్పదంగా ఉన్న 24 ప్యాకెట్లను వారు గుర్తించారు. ఆలూ… pic.twitter.com/6z0pAtpmLt
— BIG TV Breaking News (@bigtvtelugu) May 20, 2026