Electricity Safety: దేశంలో ఇటీవల నెలకొన్న గ్యాస్ అనిశ్చితి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇండక్షన్ స్టవ్స్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుత వేసవి నేపథ్యంలో చాలా మంది ఏసీలకు పని చెబుతూ సేద తీరుతున్నారు. అయితే ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడటం వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు రావొచ్చని.. పరిమితికి మించి విద్యుత్ లోడ్ పడటం వల్ల జరిమానా కూడా పడవచ్చని తెలియజేస్తున్నారు.
ఏసీ, ఇండక్షన్ స్టవ్ రెండూ కూడా ఎక్కువ విద్యుత్తును వినియోగించే ఎలక్ట్రానిక పరికరాలు. వీటిని ఒకేసారి వాడినప్పుడు మీ ఇంటికి కేటాయించిన లోడ్ పరిమితి (Sanctioned Load) మించిపోయే ప్రమాదం ఉంది. అంతకాకుండా కరెంట వైరింగ్ వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు విద్యుత్ లోడ్ ఎక్కువైతే మెయిన్ స్విచ్ తరచూ ట్రిప్ అవుతూ ఇబ్బందులు పెట్టవచ్చని పేర్కొంటున్నారు.
సాధారణంగా మెజారిటీ ప్రజలు 2 కిలో వాట్ల ఇండక్షన్ స్టవ్స్ ను వినియోగిస్తున్నారు. మరోవైపు ఏసీ 1.5 కిలో వాట్ల లోడ్ ను ఉపయోగిస్తుంది. ఒకవేళ ఇంట్లో రెండు ఏసీలు గనుక ఉన్నట్లయితే విద్యుత్ పై పడే భారం రెట్టింపు అవుతుంది. దీనికి తోడు సమ్మర్ లో తప్పనిసరిగా ఉపయోగించే ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, చిమ్నీల లోడ్ కూడా తోడైతే విద్యుత్ భారం అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంది. విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం.. అనుమతించిన లోడ్ కంటే ఎక్కువ వినియోగిస్తే కనెక్షన్ కట్ అవ్వడమే కాకుండా, భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: కేసీఆర్ చాప్టర్ క్లోజ్.. జైలుకు పంపడం ఖాయం.. బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు
వీలైనంత వరకు ఇండక్షన్ స్టవ్ వాడుతున్నప్పుడు ఏసీని కాసేపు ఆపివేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో విద్యుత్ ను అధికంగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా ఉంటే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి మీ కనెక్షన్ లోడ్ కెపాసిటీని పెంచుకోవాలని హితవు పలుకుతున్నారు. ఉదాహరణకు 2KW విద్యుత్ సామర్థ్యం ఉంటే దానిని 5KW పెంచమని అధికారులకు దరఖాస్తు చేసుకోండి. మరోవైపు ఇంటికి పాత వైరింగ్ ఉంటే అదనపు లోడ్ను తట్టుకోగలదో లేదో ఒకసారి ఎలక్ట్రీషియన్ ద్వారా తనిఖీ చేసుకుంటే మంచిది.
Also Read: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే?