Balmur Venkat: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాటల యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిల తీరుపై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
కేసీఆర్ అనే అధ్యాయం తెలంగాణలో ముగిసిపోయిందని, గత పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపుతామన్న హామీని ఇంకా నెరవేర్చలేకపోయామని వెంకట్ కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో ‘పులి వస్తోంది’ అని ప్రచారం చేసుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో కేసీఆర్ ప్రభావం శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రజలే ఆయనను రాజకీయంగా సమాధి చేశారని, ఇప్పటికైనా నిజాయితీ ఉంటే అసెంబ్లీకి వచ్చి తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీరుపై కూడా బల్మూర్ వెంకట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ విలువలున్న వ్యక్తి అనుకున్న జీవన్ రెడ్డి, తన స్వార్థం కోసం కాంగ్రెస్ను విమర్శించడం సరికాదన్నారు. గతంలో పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ ఎలాగైతే విస్మరించారో, జీవన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. సొంత బిడ్డనే నీచంగా ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, అసలు గజ్వేల్ ప్రజలు తమ ఎమ్మెల్యే ఎక్కడ అని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.
చివరగా, ధరణి పేరుతో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణాలను ‘హైడ్రా’ ద్వారా వెలికితీసి ఆ భూములను కాపాడతామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామన్నారు. ఇక హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటారో లేదో ఆయన సన్నిహితులకే క్లారిటీ లేదని, గులాబీ పార్టీలో ముసలం మొదలైందనే సంకేతాలను బల్మూర్ వెంకట్ పంపించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: మహిళా బిల్లు ఫెయిల్ అయితే సంబరాలా? కాంగ్రెస్, ఇండియా కూటమిపై బండి ధ్వజం