2026 వచ్చేసింది.. మీరు గాల్లో తేలిపోయే సమయానికి మరెన్నో రోజులు లేవు. కొన్ని సెకన్లపాటు.. మీ అంతట మీరే గాల్లో తేలిపోతూ సరికొత్త అనుభూతి పొందుతారు. ఎందుకంటే.. ఈ భూమి కాసేపు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుందట. దాని ప్రభావం వల్ల మనం కూడా గ్రావిటీ కోల్పోయి గాల్లోకి తేలుతామట. అంటే.. మనకు చందమామ మీద నడిచే అనుభవం కలుగుతుంది అన్నమాట. ఇది వినడానికి, చదవడానికి బాగానే ఉంది. కానీ, అది సాధ్యమేనా? ఇది నిజంగా జరిగే పనేనా? అయినా భూమి గురుత్వాకర్షణ శక్తి ఎందుకు కోల్పోతుంది. ఇంతకీ ఇది ఎప్పుడు జరగనుంది?
ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ ఏడాది ఆగస్టు 17వ తేదీన భూమి సుమారు 7 సెకన్లు గురుత్వాకర్షణ శక్తి కోల్పోతుందని, ఈ విషయాన్ని NASA సీక్రెట్గా ఉంచిందనే వార్తలు గుప్పుమన్నాయ్. భూమి గురుత్వాకర్షణ కోల్పోయే రోజున నాసా పలు కీలక ప్రయోగాలు చేపట్టనుందని, దాని పేరు ‘ప్రాజెక్ట్ యాంకర్’ అనే వార్తలను క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద నాసా ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల కోసం సురక్షితమైన బంకర్లకు తరలిస్తుందని, సాధారణ ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కే లేదని ప్రచారం మొదలుపెట్టారు. ఎవరు ఈ కథను అల్లేశారో గానీ.. రొట్ట వార్తలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయిపోయింది. ఇన్స్టా్గ్రామ్, ట్విట్టర్, టిక్ టాక్, ఫేస్ బుక్.. ఇలా అన్నిచోట్ల ఇదే చర్చ. దీంతో NASA నోరు తెరవక తప్పలేదు.
ఈ వైరల్ వార్తలు విని నాసానే ఆశ్చర్యపోయింది. అది ఫేక్ వార్త అని, దీనిపై నాసా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి రహస్య చర్చలను చేపట్టడం లేదని వెల్లడించింది. భూమికి ఉండే ప్రధాన శక్తి.. గురుత్వాకర్షణ. అది ఉన్నంత కాలం మనమంతా సేఫ్.. హాయిగా నేలపై నడుచుకుంటూ వెళ్లొచ్చు. గ్రావిటీకి పుల్స్టాప్ అంటూ ఏదీ ఉండదు. అయితే, ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. దాన్ని బేస్ చేసుకుని కొందరు.. ఆ రోజు భూమిపై అనేక వింతలు చోటుచేసుకోనున్నాయని, భూమి గ్రావిటీ కోల్పోవడం వల్ల మనమంతా గాల్లో తేలుతామనే రూమర్స్ క్రియేట్ చేశారు. కాబట్టి.. గాల్లో తేలడాన్ని కేవలం ఊహలకే పరిమితం చేసుకోండి. ఫేక్ వార్తలు నమ్మకండి.
గాల్లో తేలడం బాగానే ఉంటుంది. కానీ, అది చాలా ప్రమాకరం. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే మనం ఎంత ఎత్తు వరకు తేలిపోతామో తెలీదు. పైగా అది పర్మినెంట్గా ఉండదు. కేవలం 7 సెకన్లు మాత్రమే గాల్లోకి ఎగురుతారు. ఆ తర్వాత భూమికి గురుత్వాకర్షణ శక్తి తిరిగి రావడం వల్ల వెంటనే కిందపడిపోతారు. దానివల్ల భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. అదొక్కటే కాదు.. గురుత్వాకర్షణ శక్తి కోల్పోతే.. వస్తువులు, వాహనాలు సైతం గాల్లోకి తేలిపోతాయి. ఆ తర్వాత అవి ఎవరి మీద పడతాయో కూడా తెలీదు. చివరిగా.. భూమి గ్రావిటీ కోల్పోతే.. నదులు, సముద్రాలు సైతం గాల్లోకే తేలుతాయి. అవి ఎటువైపు ప్రయాణిస్తాయో కూడా చెప్పలేం. మొత్తానికి అదో పెద్ద విపత్తుగా మారుతుంది. కాబట్టి.. వదంతులు నమ్మకండి.
Also Read: వ్యోమగాములు.. తమ మలాన్నే ఆహారంగా తింటారా?