బెర్ముడా ట్రయాంగిల్.. ప్రపంచంలోనే వింతైన సముద్ర మార్గం అది. అక్కడికి వెళ్లిన ఓడలు, విమానాలు ఏమైపోయాయనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. సైన్స్ ఎంత డేవలప్ అయినా సరే.. అక్కడి రహస్యాన్ని బయటపెట్టలేకపోయింది. కానీ, అక్కడి పరిస్థితులకు ఎన్నో కారణాలను మాత్రం అంచనా వేయగలిగారు. తాజాగా ఓ పరిశోధన బృందం ఓ ముందడుగు వేసింది. మరో సరికొత్త రహస్యాన్ని బయటపెట్టింది. రామాయణంలో నీటిపై తేలియాడే రాళ్లతో.. వానర సైన్యం నిర్మించిన వంతెన వలే.. బెర్ముడాలో కూడా ఓ తేలియాడే రాతి ఫలకలను గుర్తించారు. అయితే, అవి చాలా భారీ పరిమాణంలో ఉండటాన్ని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.
శాస్త్రవేత్తలు కనిపెట్టింది బెర్ముడా ట్రాయాంగిల్ రహస్యం గురించి కాదు, బెర్ముడా ద్వీపం గురించి. సాధారణంగా సముద్రం మధ్యలో ఉండే అగ్నిపర్వత ద్వీపాలు కాలక్రమేణా సముద్రంలో మునిగిపోతుంటాయి. కానీ బెర్ముడా ద్వీపం మాత్రం చాలా వింతగా ప్రవర్తిస్తోందట. 30 మిలియన్ ఏళ్ల క్రితమే ఇక్కడ అగ్నిపర్వత ప్రక్రియ ఆగిపోయిందట. కానీ, ఇంకా అది సముద్ర మట్టానికి పైనే ఎందుకు ఉంది. దీని రహస్యం తెలుసుకోడానికి చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఎట్టకేలకు అమెరికా శాస్త్రవేత్తలు అసలు విషయాన్ని కనిపెట్టారు.
సాధారణంగా హవాయి వంటి ద్వీపాలు భూమి లోపలి నుండి వచ్చే వేడి లావా వల్ల ఏర్పడతాయి. అగ్నిపర్వత ప్రక్రియ ఆగిపోయాక, ఆ ద్వీపాలన్నీ నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి కుంగిపోతాయి. కానీ బెర్ముడాలో మాత్రం అలా జరగలేదు. చుట్టూ ఉన్న సముద్ర గర్భం కంటే ఇది సుమారు 1,600 అడుగుల ఎత్తులో స్థిరంగా నిలబడి ఉంది. ఈ నేపథ్యంలో విలియం ఫ్రేజర్, జెఫ్రీ పార్క్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టి.. కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుంది.
భూమి లోపల ఏం ఉందో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే శాస్త్రవేత్తలు భూకంప తరంగాలు (సిస్మిక్ వేవ్స్) ద్వారా భూమి లోపల ఏం ఉందో అన్వేషించారు. బెర్ముడాలోని సిస్మిక్ స్టేషన్ సహకారంతో భూమికి 20 మైళ్ల లోతు వరకు పరిశీలినలు జరిపారు. ఈ సందర్భంగా బెర్ముడా ద్వీపం కింద సుమారు 12 మైళ్ల మందపాటి భారీ రాతి పొరను కనుగొన్నారు.
చిత్రం ఏమిటంటే.. ఈ రాతిపొర మిగతా రాళ్ల తరహాలో బరువుగా లేవట. మాంటిల్ రాళ్ల కంటే తేలికగా.. చాలా తక్కువ సాంద్రతో ఉన్నాయట. ఈ రాతిపొర మొత్తం బెర్ముడా దీపాన్ని సముద్రంపై తేలియాడాలే చేస్తుందట. అంటే బెర్ముడా సాధారణ ద్వీపం కాదు.. సముద్రంపై తేలియాడే ద్వీపం. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘అండర్ ప్లేటింగ్’ అని పిలుస్తున్నారు.
ఏకంగా ద్వీపాన్నే పైకి తేలేలా చేసిన ఈ ప్రక్రియ ఎలా మొదలైందని పరిశీలిస్తే మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. కొన్ని కోట్ల ఏళ్ల కిందట కార్బన్తో కూడిన.. ద్రవరూపంలోని శిలలు భూమి లోపలి పొరల్లోకి చేరాయి. ఆ తర్వాత అవి చల్లబడి.. తేలికపాటి పొరగా మారి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ వింత రాతి పొర పురాతన సూపర్ కాంటినెంట్ ‘పాంజియా’ ఏర్పడిన కాలం నాటిది కావచ్చని భావిస్తున్నారు.
బెర్ముడా ద్వీపం కింద కనుగొన్న ఈ రాతి పొర ఒక భౌగోళిక అద్భుతం. అయితే, దీనికి బెర్ముడా ట్రయాంగిల్లో చోటుచేసుకున్న మిస్టరీ ఘటనలతో దీనికి సంబంధం ఉందా లేదా అనే విషయంపై సరైన స్పష్టత లేదు. కానీ, కొన్ని సందేహాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బెర్ముడా కింద ఉన్న రాతి పొర కేవలం ద్వీపాన్ని పైకి ఎత్తడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఓడలను ముంచేయడానికి లేదా విమానాలను కూల్చేయడం వంటివి చేయలేదు. అయితే, ఈ రాతి పొరలో ఉండే అత్యధిక కార్బన్, మిథేన్ వంటి ఇతర వాయువులు విడుదలై.. సముద్రం ఉపరితలానికి చేరినట్లయితే.. నీటి సాంద్రత తగ్గిపోతుంది. దానివల్ల ఓడలు మునిగిపోయే అవకాశాలున్నాయి. కానీ, తాజా పరిశోధనలో అలాంటి ఆధారాలేవీ దొరకలేదు.
బెర్ముడా ప్రాంతంలో అయస్కాంత క్షేత్రం అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇందుకు భూమి లోపల ఉండే బెర్ముడా వంటి రాతి పొరలు లేదా ఖనిజ నిక్షేపాలు అయస్కాంత శక్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనివల్ల నౌకలు, విమానాల్లోని దిక్సూచీలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించవచ్చు. అయితే, ఇప్పటివరకు జరిగిన పరిశోదనల్లో శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద అలలు, వాతావరణ మార్పులు, మీథేన్ గ్యాస్ విస్ఫోటనం వంటి కారణాల వల్లే ఆ ప్రమాదాలు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. సముద్రంపై తేలియడే రాళ్లు ఉన్నవనే మాట వాస్తవం. దీన్ని బట్టి చూస్తే మన పురాణాలు వీటి గురించి ఎప్పుడో చెప్పేశారు. బెర్ముడా ద్వీపం తరహాలోనే దక్షిణ భారత దేశంలో కూడా తేలికపాటి రాళ్లు ఉండేవని అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది అక్కడ అలాంటి రాళ్లను కనుగొన్నారు.
Also Read: చంద్రుడిపై మగాళ్ల వీర్యం ఉత్తి నురగేనా? ఆస్ట్రేలియా స్టడీలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడి