న్యూఢిల్లీ, స్వేచ్ఛ: అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో శక్తి సామర్థ్యాలకు మరింత ఊతమిస్తూ మూడవ లాంచ్ ప్యాడ్ (టీఎల్పీ) ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏకంగా రూ.3,985 కోట్లతో ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. భవిష్యత్ తరాలు చేపట్టబోయే ప్రయోగాలకు ఈ లాంచ్ ప్యాడ్ ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని, లాంచ్ ప్యాడ్తో పాటు కావాల్సిన ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నామని కేబినెట్ ప్రకటించింది. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్రల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అంచనాలు ఉన్నాయి.
ఈ లాంచ్ ప్యాడ్ను 48 నెలలు లేదా 4 సంవత్సరాల వ్యవధిలో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మూడవ లాంచ్ ప్యాడ్ అందుబాటులోకి వస్తే ఇస్రో శాస్త్రవేత్తలు రెగ్యులర్గా ప్రయోగాలు చేపట్టేందుకు మార్గం సుగుమం అవుతుంది. దేశ అంతరిక్ష పరిశోధనలు వేగం పుంజుకుంటాయి. మూడవ లాంచ్ ప్యాడ్ నుంచి ఎన్జీఎల్వీలను (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికిల్) కూడా ప్రయోగించవచ్చు. ఎన్జీఎల్వీతోపాటు సెమిక్రయోజెనిక్ స్టేజ్తో ఎల్వీఎం3 వెహికిల్స్ను కూడా ప్రయోగించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడిచింది. మునుపటి లాంచ్ ప్యాడ్లు కూడా అందుబాటులో ఉండడంతో లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలు మెరుగుపడతాయని, ఇస్రో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు.
8వ వేతన సంఘం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఉపశమనం కలిగిస్తూ 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రమంత్రి వర్గం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో వేతన సంఘం చైర్మన్ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటు అయ్యాయని, ఏమాత్రం ఆలస్యం లేకుండా వేతన సంఘాలు ఏర్పాటుకు ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని వివరించారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న 7వ వేతన సంఘం 2016లో ఏర్పాటు అయిందని, 2026లో ముగియనుందని ప్రస్తావించారు. గడువు తీరడానికంటే ముందే వేతన సంఘం ఏర్పాటు చేస్తే అన్ని అంశాలను పరిగణనలోకి వేతనాలను సిఫార్సు చేయడానికి సమయం దొరుకుతుందని అశ్విని వైష్ణవ్ వివరించారు. త్వరలోనే కొత్త కమిషన్ ఛైర్మన్ను, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తామని ఆయన వెల్లడించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ జీత, భత్యాలు ఎంత ఉండాలో వేతన సంఘమే నిర్ణయిస్తుంది. ఆజీతాలు, పెన్షన్లను ఎంత మేర పెంచాలనేది సభ్యులు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తారు. తదనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ వేతన సర్దుబాట్లు చేడుతుంది.
Also Read: ఇస్రో మరో ఘనత.. నింగిలో స్పేడెక్స్ డాకింగ్ ప్రయోగం సక్సెస్
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి? నేడు అధికారిక ప్రకటనకు అవకాశం
అమరావతి, స్వేచ్ఛ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందా?, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి కొత్త ఊపిరిపోయాలని భావిస్తోందా? అంటే ఔననే తెలుస్తోంది. వైజాగ్ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ గుడ్న్యూస్ను నేడే (శుక్రవారం) వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అధికారిక ప్రకటన చేయనున్నారని తెలిసింది. అయితే, ఈ ఆర్థిక ప్యాకేజీ నిధుల రూపంలో కాకుండా ఆధునిక యంత్రాలను సమకూర్చే విధానంలో ఉండవచ్చంటూ తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముడి పదార్థాలు సమకూర్చుకోలేక వైజాగ్ స్టీల్ ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెండు బ్లాస్ట్ ఫర్నేసుల్లో మాత్రమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పాత ఫర్నేసులకు స్థానంలో నూతనంగా 3 ఎలక్ర్టిక్ మెషినరీలను అందుబాటులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ అదునాత యంత్రాల ద్వారా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత పెరుగుతుందని అంచనాగా ఉంది. పొడవాటి ఉత్పత్తులతో పాటు భవన నిర్మాణాలతో పాటు ఇతక కీలకమైన రంగాల్లో అధికంగా ఉపయోగించే ఉక్కును తయారుచేయనున్నారు.