Cyber Crime Hyderabad: సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ నెలలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదు చేసి, పలు రాష్ట్రాల వరకు చేరి నిందితులను అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు సహాయం చేయడంలో, ఆర్థిక నష్టం రికవరీ చేయడంలో పోలీసులు శ్రద్ధ చూపుతున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అక్టోబర్లో మొత్తం 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 55 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 130 కేసులు హైదరాబాద్ లోనే నమోదు కాగా, అందులో 29 మంది నిందితులు పట్టుబడ్డారు. పోలీసులు సైబర్ బాధితులకు రూ.62.34 లక్షలను తిరిగి అందజేశారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన వివరాలు బయటపడ్డాయి. నిందితులు 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 24 మంది, తెలంగాణలో 45 మంది సైబర్ నేరాలకు పాల్పడినట్లు తేలింది. వీరి నుంచి 31 మొబైల్ ఫోన్లు, 14 చెక్బుక్స్, 9 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ పోలీసుల దర్యాప్తులో చైనా దేశస్థుల హస్తం ఉన్నట్లు తేలింది. వారు డిజిటల్ అరెస్ట్ స్కామ్లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైనీస్ ఏజెంట్లు భారతీయుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి, డబ్బు వసూలు చేసే గ్యాంగ్లకు సాంకేతిక సహాయం అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇటీవల 62 ఏళ్ల వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని రూ.1.07 కోట్లు దోచుకున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, మిస్ అయిన మొబైల్ ఫోన్ను ఉపయోగించి రూ.1.95 లక్షలు దోచుకున్న ముగ్గురు నిందితులు కూడా పట్టుబడ్డారు.
సైబర్ పోలీసుల మరో దర్యాప్తులో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.24.71 లక్షలు మోసం చేసిన ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. అతను సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి, యాప్ ద్వారా డబ్బులు తీసుకుని గల్లంతయ్యాడు.
ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, డిజిటల్ అరెస్ట్లు, సోషల్ మీడియా ఫ్రాడ్లు పెరుగుతున్నాయి. ఈ మోసాల ద్వారా మొత్తం 33 ప్రధాన కేసులు నమోదయ్యాయి. నిందితులు ఫోన్ కాల్స్, ఫేక్ యాప్లు, మెసేజ్ లింకులు ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు.
దర్యాప్తు సందర్భంగా నిందితుల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తంలో చాలా భాగం క్రిప్టో కరెన్సీ, ఫిన్టెక్ యాప్ల ద్వారా ఇతర దేశాలకు బదిలీ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రేషన్ బియ్యంతో.. సీఎం రేవంత్కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్
సైబర్ నేరాల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, పెట్టుబడి యాప్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే మెసేజ్లను నమ్మవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.