AC Water Tips: వేసవిలో కాలంలో చాలా మంది పెద్ద ఎత్తున ఏసీలపై ఆధారపడుతుంటారు. గంటల తరబడి ఏసీని రన్నింగ్ లో ఉంచి.. భానుడి తాపం నుంచి ఉపశమనం పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఏసీ నుంచి భారీగా నీరు (Condensate water) బయటకు రావడం అందరికీ తెలిసిందే. అయితే ఏసీ నుంచి వచ్చే ఈ నీటిని మెుక్కలు ఉపయోగించవచ్చా? లేదా? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే మెుక్కలకు ఏసీ నీరు వాడొచ్చు గానీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి లాభనష్టాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఏసీ నీరు గాలిలోని తేమ నుండి తయారవుతుంది. ఇందులో క్లోరిన్, ఫ్లోరైడ్ వంటి రసాయనాలు ఉండవు. కాబట్టి ఇవి మెుక్కలకు మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు వేసవిలో ఉండే నీటి ఎద్దడి గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు ఏసీ నుంచి వచ్చే లీటర్ల కొద్ది నీటిని.. ఇలా మెుక్కలకు వాడటం వల్ల మున్సిపల్ లేదా బోర్ నీటిని ఆదా చేయవచ్చు. మరోవైపు సాధారణ నీటితో పోలిస్తే.. ఏసీ వాటర్ లో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
ఏసీ నీటిని మెుక్కలకు పోయడం వల్ల కొన్ని నష్టాలు సైతం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏసీ నుంచి వచ్చేది వడపోసిన నీరు కాబట్టి.. ఇందులో మెుక్కలకు కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండవు. అలాగేఏసీ కాయిల్స్ శుభ్రంగా లేకపోతే.. ఆ నీటిలో బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు (Fungi) ఉండే అవకాశం ఉంది. ఏసీ నీరు స్వల్పంగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నందున కొన్ని మెుక్కలకు ఇది నష్టం చేకూర్చవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ వచ్చేది ఎప్పుడంటే?
ఏసీ నీటి వినియోగానికి సంబంధించి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. వారి ప్రకారం.. ఏసీ నీటిని నేరుగా వాడకుండా సాధారణ ట్యాప్ నీటితో కలిపి మొక్కలకు పోయడం మంచిది. దీనివల్ల మొక్కలకు కావాల్సిన ఖనిజాలు అందుతాయి. నీటిని మొక్కల ఆకులపై చిలకరించకుండా కేవలం కుండీలోని మట్టిలో మాత్రమే పోయాలి. ఏసీ నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అందులో దోమలు చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పట్టిన నీటిని వెంట వెంటనే వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మెుత్తంగా చూస్తే.. ఏసీ నీటిని పారబోయకుండా మొక్కలకు వాడటం ఒక మంచి పర్యావరణ హితమైన అలవాటు అని చెప్పవచ్చు.
Also Read: సినిమాగా అమీష్ త్రిపాఠి నవల.. రణవీర్ సింగ్ పాత్ర గురించి తెలిస్తే మతి పోతుంది..