ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉండటమే గొప్ప. అది కూడా కేవలం సంపన్నుల ఇళ్లలో మాత్రమే కనిపించేవి. దీంతో ఊర్లో జనం అంతా.. వారి ఇంటి గుమ్మం ముందు కూర్చొని టీవీ చూసేవారు. అది కూడా వారంలో ఒకసారి.. ఒక అరగంట ప్రసారమయ్యే మూడు పాటల ‘చిత్రలహరి’ కోసం. మరికొందరు రేడియోలతో, టేప్ రికార్డులతో కాలక్షేపం చేస్తే.. మరికొందరు పుస్తకాలతో గడిపేసేవారు. ఇక చదువు విషయానికి వస్తే.. అప్పట్లో వారికి బోలెడంత టైమ్ ఉండేది. రీల్స్, షార్ట్స్ లేకపోవడం వల్ల చక్కగా ఒక చోట కూర్చొని చదువుకొనేవారు. పరీక్షల్లో తేడా వస్తే.. మాస్టారు తేట తీస్తారు కాబట్టి.. బట్టీపట్టి మరి బుర్రలోకి ఎక్కించుకొనేవారు. నోటితోనే లెక్కలు చెప్పేసేవారు అంటే.. వారు తమ మెదడుకు ఎంత మేత పెట్టేవారు అర్థమవుతుంది. మరి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.
ఇప్పుడు ఎవరినైనా జెన్ జెడ్ పిల్లాడిని.. వన్ ప్లస్ త్రి ఎంత అని ఠక్కున అడిగి చూడండి. కాసేపు ఆగిపోతాడు. చేతితో లెక్క పెట్టడానికి బదులు.. మొబైల్ తీసినా ఆశ్చర్యపోవద్దు. అయితే వీళ్లు తెలివి తక్కువ వారు కాదు. స్మార్ట్ కిడ్స్.. లెక్కలు చేయడానికి బుర్ర, కాలిక్యూలేటర్ వాడకపోయినా.. ఏఐని మాత్రం వాడేస్తారు. అరే గ్రోకు (Grok).. ఒకటి ప్లస్ మూడు ఎంత రా? అనగానే.. అది రకరకాల కాలిక్యూలేషన్స్తో నాలుగు అనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. మరి ఇలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు బుర్రతో ఆలోచించాల్సిన అవసరం ఏం ఉంది చెప్పండి. ఇది చాలా చాలా చిన్న ఉదాహరణ.. ఏఐ సాయంతో ఇంకా మన పోరగాళ్లు చాలానే చేస్తున్నారు. 5 శాతం మంచికి వాడుతుంటే.. మిగతా 95 శాతం మంది మాత్రం తప్పుడు పనులు వాడేస్తున్నారు. తమ బుర్రకు పెద్దగా పని చెప్పకుండా ఏఐతో పనులు చేయించుకుంటున్నారు. ఇక టెక్నాలజీలో ఎప్పుడూ అడ్వాన్సుడ్గా ఉండే చైనాలో ఇది మరింత ఎక్కువగా ఉందట. తాజాగా అక్కడ జరిపిన సర్వేలో ఒక షాకింగ్ విషయం బయటపడింది.
ఒకసారి టైమ్ మిషీన్లో 80, 90’s లోకి వెళ్దాం. అప్పట్లో పరీక్షల్లో కాపీ కొట్టేందుకు.. ముందు రోజు రాత్రి ఒక యుద్ధమే జరిగేది. రాత్రికి రాత్రి చిన్న అక్షరాలతో స్లిప్స్ రాసి.. చొక్కాల్లో తోపుకోవడం, టెక్ట్స్ బుక్స్లో పేజీలను చింపేసి.. చిన్న అక్షరాలతో జిరాక్సు తీసుకోవడం.. ఇలా ఒకటేమిటీ చాలా ప్రయత్నాలే చేసేవారు. పరీక్షల టైమ్లో స్క్వాడ్ వస్తే.. పై ప్రాణాలు పైకే పోయేవి. ప్రస్తుతం ఇండియాలో ఆ ట్రెండ్ ఇంకా నడుస్తోంది. అయితే కొందరు కంటికి కనిపించని ఇయర్ బడ్స్ ద్వారా చీటింగ్ చేసే ప్రయత్నాలు చేసి దొరికిపోయారు. ఇక చైనా పిల్లల విషయానికి వస్తే.. చీటింగ్ కా బాప్ అన్నట్లుగా తయారయ్యారట. వీళ్లు ఈ మధ్య స్మార్ట్ గ్లాసెస్ వాడుతున్నారట.
‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’ అనే మీడియా సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. చైనాలో విద్యార్థులు ఈ మధ్య పరీక్షలకు ఏఐ గ్లాసెస్ ఉపయోగిస్తున్నారట. అయితే, అవి చాలా ఖరీదు కావడంతో కొన్ని సంస్థలు భారీ ఆఫర్లతో వారికి ఆ కళ్లద్దాలను అద్దెకు ఇస్తున్నాయట. వీటిని ఇన్విజిలేటర్లు కనిపెట్టడం కూడా కష్టమే. దీంతో విద్యార్థులు తమ పాకెట్ మనీ పెట్టి మరీ ఈ గ్లాసెస్ కొనుగోలు చేసి.. చీటింగ్ చేసేస్తున్నారట.
ఏఐతో పనిచేసే ఈ కళ్లజోళ్లు బయటకు చూసేందుకు సాధారణంగానే ఉంటాయి. కెమేరా, ఆడియో ఫీచర్లు కలిగిన ఈ గ్లాసెస్.. ప్రశ్నా పత్రాన్ని స్కాన్ చేసి.. ఆగ్మెంటెడ్ రియాలిటీలో సమాధానాలు అందిస్తాయి. అంటే.. VR వీడియోల తరహాలో.. ఆ ప్రశ్నలకు తగిన జవాబులు కళ్లద్దాలపై కనిపిస్తాయి. మొదట్లో ఈ స్మార్ట్ గ్లాసెస్ చాలా పెద్దవిగా బరువుగా ఉండేవి. కానీ, అలీబాబా, షియోమీ కంపెనీలు.. సాదారణ కళ్లద్దాల తరహాలో వీటిని తయారు చేస్తున్నాయి. వీటిని ఏఐ గ్లాసెస్ అని కనిపెట్టడం చాలా కష్టం. ఈ మోసాలను గుర్తించిన చైనా ప్రభుత్వం జాతీయ స్థాయి విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఏఐ స్మార్ట్ గ్లాసెస్ను నిషేదించింది. అయితే, సాధారణ పరీక్షల్లో మాత్రం వీటిని అడ్డుకోవడం కష్టంగా మారింది.
హాంగ్కాంగ్ యూనివర్శీటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ మీద ఓ ప్రయోగం చేశారు. వంద మంది విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక పరీక్ష పెట్టారు. వారిలో ఒక విద్యార్థికి ChatGPT 5.2 ఏఐ మోడల్ కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ఇచ్చారు. ఫలితాల్లో షాకింగ్ విషయం తెలిసింది. 100కు 92.5 శాతం మార్కులతో ఆ విద్యార్థి మొదటి ఐదు స్థానాల్లో ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు. మిగతా విద్యార్థులు కేవలం 72 శాతం మార్కులు మాత్రమే సాధించడం గమనార్హం.
ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ధరలు చాలా ఎక్కువ. ఆన్లైన్లో రూ.25,000 నుంచి రూ.93,000 వరకు ధర పలుకుతున్నాయి. అందుకే విద్యార్థులు వాటిని కొనుగోలు చేయకుండా.. పరీక్షల సమయంలో అద్దెకు తీసుకుంటున్నారు. రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.1200 చెల్లిస్తున్నారు. ఈ గ్లాసెస్ గురించి ఓ విద్యార్థిని ‘రెస్ట్ ఆఫ్ ది వరల్డ్’ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను ఫెయిల్ అవుతానని భావించే సబ్జెక్ట్కు సంబంధించిన పరీక్షల్లో మాత్రమే ఈ స్మార్ట్ గ్లాస్లు ఉపయోగిస్తున్నా. అవసరమైతే ఇతర విద్యార్థులకు అద్దెకు కూడా ఇస్తా’’ అని తెలిపింది.
Also Read: చనిపోయిన ఆప్తులు ఇక మీ కళ్ల ముందే కదులుతారు.. మాట్లాడతారు.. భలే టెక్నాలజీ
మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ ఏఐ గ్లాసెస్కు అనుసంధానం చేస్తూ ఒక ఉంగరంలాంటి చిన్న రిమోట్ను కూడా విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. ఆ రింగ్ ప్రశ్నా పత్రాన్ని స్కాన్ చేసి.. ఏఐకు అందిస్తుంది. అది ఆ మేటర్ను అర్థం చేసుకుని.. జవాబులను ఆ విద్యార్థులు పెట్టుకొనే కళ్లజోడు లెన్స్పై ప్రదర్శిస్తుంది. అలా వారు దొంగ దారిలో పరీక్షలు పాస్ అవుతున్నారు. మీకు కూడా ఇలా పరీక్షలు పాస్ కావాలని అని ఉందా? కల్లో కూడా అలాంటి ఆలోచన చేయొద్దు. పొరపాటున దొరికిపోతే జీవితమే నాశనం అవుతుంది. కష్టపడి చదివి బుర్రలో పెట్టుకుంటే.. భవిష్యత్తులో ఏఐ కంటే మెరుగ్గా పనిచేస్తారు. ఇంటర్వ్యూల్లో కూడా ధైర్యంగా మీకు తెలిసిన సబ్జెక్టుపై సమాధానాలు ఇవ్వగలరు. కాబట్టి.. ఈ చైనా పిల్లల్లా చెడిపోవద్దు.