Kalvakuntla Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్లను తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 1148 కోట్ల రూపాయల పనులను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని విమర్శించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం 5 లక్షల రూపాయలకు మించి ఉండే ఏ పనికైనా టెండర్లు పిలవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ను పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన పనులను వెంటనే రద్దు చేసి బహిరంగ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.
హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రభుత్వం భయాందోళనకు గురి చేస్తోందని కవిత ఆరోపించారు. స్క్వేర్ ఫీట్కు 150 రూపాయల చొప్పున అడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బ్లాక్ మెయిల్ దందాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే ఈ వసూళ్లను ఆపకపోతే ఈడీ (ED)కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హెచ్ఎండీఏ పరిధిలో 35 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేసినా హైదరాబాద్ అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి తన అవినీతిని పెంచుకునేందుకు ‘ఫ్యూచర్ సిటీ’ అంటూ కొత్త హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు. అయితే ఇది కమీషన్ల కక్కుర్తి కోసం కాకుండా చిత్తశుద్ధితో చేయాలని సూచించారు. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని ప్రజలను నమ్మించేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొత్త కమీషన్ల కోసమే మరమ్మత్తుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేస్తోందని కవిత విమర్శించారు. బిల్లు అమలుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదన్నారు. 2027 జనగణనలో ఓబీసీ గణన కూడా చేపట్టాలని అప్పటి వరకు వేచి ఉండాలని డిమాండ్ చేశారు. మహిళా కోటాలో ఓబీసీ మహిళలకు కచ్చితంగా సబ్ కోటా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే తాము ఢిల్లీకి వెళ్లి పోరాడతామని వెల్లడించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తనపై చేస్తున్న పురుషాహంకార వ్యాఖ్యలను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ మహిళలకు స్వయంప్రతిపత్తితో ఆలోచించే సత్తా ఉందని గుర్తు చేశారు. ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
Read Also: Kaleshvaram : సర్కార్ నిర్ణయంపై హరీశ్ రావు వెర్షన్ ఏంటి?