Fridge Mistakes in Summer: సాధారణంగా ఎండలు ముదురుతున్న కొద్దీ ఇంట్లో ఫ్రిడ్జ్ వాడకం విపరీతంగా పెరుగుతుంటుంది. కూల్ వాటర్ దగ్గర నుంచి పండ్లు, కూరగాయలు, వండిన వంటకాల వరకు ప్రతిదానికీ ఫ్రిడ్జ్పైనే ఆధారపడుతుంటాం అయితే, సమ్మర్లో ఫ్రిడ్జ్ను వాడేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కరెంట్ బిల్లును భారీగా పెంచేస్తాయని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్రిడ్జ్ను సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా దాదాపు 15 నుంచి 25 శాతం వరకు విద్యుత్ ఆదా చేయవచ్చు. మరి కరెంట్ బిల్లులు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దామా..
ఎండ వేడికి ఇంట్లో వాళ్లు, ముఖ్యంగా పిల్లలు చల్లటి నీళ్ల కోసమో, స్నాక్స్ కోసమో ఫ్రిడ్జ్ తలుపును పదే పదే తీస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారీ డోర్ తీసినప్పుడు లోపల ఉండే చల్లటి గాలి బయటకు పోయి, బయట ఉండే వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల లోపల మళ్లీ చల్లదనం పెంచడానికి కంప్రెషర్ ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. ఫలితంగా కరెంట్ బిల్లు పెరుగుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ నుంచి కావాల్సిన వస్తువులను పదే పదే కాకుండా ఒకేసారి బయటకు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది ఫ్రిడ్జ్ కూలింగ్ను మాగ్జిమమ్ మోడ్లో పెట్టేస్తుంటారు. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఫ్రిడ్జ్ లోపల నార్మల్ విభాగాన్ని 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య, అలాగే ఫ్రీజర్ భాగాన్ని మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచడం చాలా ఉత్తమం. ఈ టెంపరేచర్ సెట్టింగ్స్ వల్ల వస్తువులు తాజాగా ఉండటమే కాకుండా కరెంట్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది.
Also Read: మీ ఇంట్లో బోరు నీళ్లు వాడుతున్నారా? ఉప్పుదనం, బ్యాక్టీరియాకు చెక్ పెట్టే బెస్ట్ ప్యూరిఫైయర్లు ఇవే!
కొంతమంది వండిన వెంటనే వేడి వేడి గిన్నెలను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ వేడిని తగ్గించి మళ్లీ చల్లబరచడానికి కంప్రెషర్ నిరంతరాయంగా రన్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఫ్రిడ్జ్ లైఫ్ను తగ్గించడమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని పెంచుతుంది. అందుకే వండిన ఆహార పదార్థాలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి.
ఇంట్లో స్థలం తక్కువగా ఉందని చాలామంది ఫ్రిడ్జ్ను గోడకు అంటించి పెడుతుంటారు. ఫ్రిడ్జ్ వెనుక భాగం నుంచి వేడి గాలి బయటకు రావడానికి తగినంత స్థలం ఉండాలి. గాలి ఆడేలా కనీసం నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరం గోడకు, ఫ్రిడ్జ్కు మధ్య ఉంచడం అవసరం. లేదంటే మిషన్ త్వరగా వేడెక్కిపోయి, కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది.
ఫ్రిడ్జ్ నిండా వస్తువులను ఇరుకైన పద్ధతిలో సర్దితే లోపల చల్లటి గాలి సరిగ్గా తిరగదు. దీనివల్ల కూలింగ్ సమానంగా అందక కంప్రెషర్పై భారం పడుతుంది. అలాగే ఫ్రిడ్జ్ తలుపుకున్న రబ్బర్ గ్యాస్కెట్ లూజ్గా ఉంటే లోపలి చల్లదనం బయటకు లీక్ అవుతుంది. అందుకే నెలకు ఒకసారి ఫ్రిడ్జ్ వెనుక భాగంలో దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవడం, రబ్బర్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం వంటి చిన్న చిన్న మార్పులు చేస్తే కరెంట్ బిల్లులు తడిసి మోపెడు కాకుండా చూసుకోవచ్చు.
Also Read: మన ఏసీల వాడకం చూసి తెల్లబోయిన అమెరికా అమ్మడు.. ఇండియాకు, యూఎస్కు ఇంత తేడా ఉందా!