Delivery OTP Scam| సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకవైపు పోలీసులు, ప్రభుత్వం నిరంతరం ప్రజల్లో అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా.. దొంగలు మాత్రం విన్నూత్న పద్ధతుల్లో ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఆన్ లైన్ ఆర్డర్ డెలివరీ పేరుతో దొంగలు ఒక వ్యక్తి ఖాతా నుంచి రూ.2.49 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
పోలీసులు ఈ కేసును క్లాసిక్ ఓటీపీ డెలివరీ స్కామ్గా వర్ణించారు. మోసగాళ్లు పార్శిల్ లేదా కొరియర్ డెలివరీ ఎదురుచూస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తారు. వీరు డెలివరీ ఫెయిల్ అయిందని నకిలీ మెసేజ్లు పంపుతారు. చిన్న మొత్తంలో పేమెంట్ అడిగి బాధితులను ట్రాప్ చేస్తారు. ఆ తరువాత ఒకసారి బ్యాంక్ కార్డు వివరాలు, ఓటీపీ చెప్పాలని అడుగుతారు. తొందరపాటులో బాధితులు ఆ వివరాలు చెప్పగానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం ఖాళీ అయిపోతుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 59 ఏళ్ల ఒక వ్యక్తి తనకు డిహెచ్ఎల్ నుంచి ఒక కొరియర్ పార్సిస్ రావాల్సి ఉందని ఎదురుచూస్తుండగా.. రెండు రోజుల తరువాత ఆయన మొబైల్ కు ఒక SMS వచ్చింది. ఆ SMS గుర్తుతెలియని ఫోన్ నెంబర్ వచ్చింది. అందులో ఆయనకు రెండు సార్లు కొరియన్ డెలివరీ వచ్చినా కస్టమర్ అందుబాటులో లేని కారణంగా డెలివరీ ఫెయిల్ అయిందని ఉంది. ఇప్పుడు డెలివరీ చేయాలంటే రూ.25 చిన్న మొత్తంలో ఫైన్ చెల్లించాలని ఉంది.
ఆ మెసేజ్ చదివిన బాధితుడు నిజమని నమ్మి ఆ మెసేజ్ లో ఉన్న పేమెంట్ లింక్ ని క్లిక్ చేశాడు. ఆ వెబ్ పేజీలో అతని బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగారు. అక్కడ ఫామ్ ఫిల్ చేయగానే ఓటిపి వచ్చింది. బాధితుడు కేవలం రూ.25 లే కదా అని భావించి ఆ ఓటిపిని కూడా పేమెంట్ లింక్ లో ఎంటర్ చేశాడు. అంతే ఆ తరువాత అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2.49 లక్షలు ట్రాన్స్ఫర్ అయిందని మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ చూసిన వెంటనే బాధితుడు వెంటనే బ్యాంక్ అకౌంట్ కి ఫోన్ చేశాడు. ఆ తరువాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. డెలివరీకి సంబంధించిన మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేమెంట్ కోసం ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ లింక్లు పంపితే నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. నిజమైన కొరియర్ కంపెనీలు ఎప్పుడూ అలాంటి ఫీజులు అడగవని పోలీసులు స్పష్టం చేశారు. పేరున్న కంపెనీలు రాండమ్ లింక్ల ద్వారా పేమెంట్ తీసుకోవు.
Also Read: ఇంటర్నెట్లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
పోలీసులు తెలియని లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దని సలహా ఇచ్చారు. ఎప్పుడూ కనివిని ఎరుగని వెబ్సైట్లలో కార్డు డిటెయిల్స్ ఎంటర్ చేయవద్దని చెప్పారు. ఓటీపీ, సీవీవీ నంబర్, పిన్ ఎప్పుడూ షేర్ చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకులు ఎప్పుడూ కస్టమర్ల నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ల రహస్య సమాచారం అడగవని తెలిపారు. అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు. మోసం జరిగితే తక్షణం బ్యాంక్కు, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సంప్రదించాలి. త్వరగా రిపోర్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ బ్లాక్ లేదా రివర్స్ చేయడం సాధ్యమవుతుంది.
ఆన్లైన్ షాపింగ్, హోమ్ డెలివరీలు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఈ సౌలభ్యాన్ని మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ నిర్లక్ష్య వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు. చాలా స్కామ్లు మొదట్లో సాధారణ చర్యగానే కనిపిస్తాయి. కానీ అవగాహనే బలమైన రక్షణ అని అధికారులు చెప్పారు. రోజువారీ ఆన్లైన్ యాక్టివిటీలలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో ఆన్లైన్ ఆర్డర్లు పెరిగిపోయాయి. పార్శిల్ వచ్చే సమయంలో వచ్చే మెసేజ్లు నిజమో కాదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అధికారిక కొరియర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారానే ట్రాకింగ్ చేయాలి. చిన్న మొత్తం పేమెంట్ అడిగినా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి కార్డు డిటెయిల్స్ ఇచ్చేస్తే మొత్తం అకౌంట్ ఖాళీ అవుతుంది. పోలీసులు, బ్యాంకులు ఎప్పుడూ మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ అడగవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మోసం జరిగినా ఆందోళన పడకుండా త్వరగా బ్యాంక్, పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నష్టాన్ని తగ్గించవచ్చు.