Ancient Cooling Methods: ఈ రోజుల్లో కాస్త ఎండ పెరిగితే చాలు.. ఏసీలు, కూలర్లు లేకపోతే క్షణం కూడా గడపలేం. మరి శతాబ్దాల క్రితం, ఎండలు మండిపోయే కాలంలో రాజులు, మహారాజులు అంత పెద్ద పెద్ద కోటల్లో ఎలా ప్రశాంతంగా నివసించగలిగారు? అప్పట్లో కరెంట్ లేదు, ఫ్యాన్లు లేవు, అసలు ఆధునిక టెక్నాలజీనే లేదు. అయినా సరే, వారి అంతఃపురాలు ఎప్పుడూ చల్లగా, హాయిగా ఉండేవి. దీని వెనుక ఉన్న రహస్యం మరేదో కాదు.. మన పూర్వీకుల అద్భుతమైన నిర్మాణ శైలి, ప్రకృతి వనరులను వాడుకునే తెలివితేటలే. ఈ నాటి ఎకో-ఫ్రెండ్లీ భవనాల నిర్మాణానికి కూడా ఆనాటి పద్ధతులే స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
పూర్వ కాలంలో రాజులు తమ ప్యాలెస్లను నిర్మించడానికి చెరువులు, సరస్సులు, తోటలు లేదా కొండల సమీప ప్రాంతాలను ఎంచుకునేవారు. వీటి వల్ల చుట్టుపక్కల వాతావరణం సహజంగానే చల్లబడుతుంది. కోట లోపలి ప్రాంగణాల్లో పెద్ద పెద్ద ఫౌంటెన్లు ఏర్పాటు చేసేవారు. బయటి నుండి వచ్చే వేడి గాలి ఈ నీటి ఫౌంటెన్లను దాటుకుని లోపలికి వచ్చేసరికి చల్లని గాలులుగా మారిపోయేది. మొఘల్ రాజులైతే గదుల్లో పెద్ద పెద్ద నీటి పాత్రలను ఉంచి గది ఉష్ణోగ్రతను అదుపులో ఉంచేవారు.
కోటలు ఎప్పుడూ చల్లగా ఉండటానికి మరో ముఖ్య కారణం వాటి మందపాటి గోడలు. మట్టి, సున్నం, ఇటుకలు, ఇసుక రాళ్లను ఉపయోగించి ఈ గోడలను చాలా లావుగా నిర్మించేవారు. ఇవి బయటి వేడిని అంత సులభంగా లోపలికి రానివ్వవు. పగటిపూట ఎండ తీవ్రతను ఇవి అడ్డుకుంటే.. రాత్రి పూట వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో వాడిన ఇసుక రాళ్లు ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేలా సహాయపడేవి.
Also Read: ఏసీ ఆన్ చేశాక ఈ రెండు మార్పులు చేసుకుంటే.. కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది!
ఎడారి ప్రాంతాల్లోని ప్యాలెస్లలో ‘బాద్గీర్’ అని పిలిచే విండ్ క్యాచర్లను ఉపయోగించేవారు. ఇవి భవనాలపై కట్టే ఎత్తైన నిర్మాణాల లాంటివి. బయట వీచే చల్లటి గాలిని ఇవి లోపలికి లాక్కుంటాయి. ప్రకృతి సిద్ధమైన గాలి ప్రసరణ నియమం ప్రకారం.. లోపల ఉన్న వేడి గాలి పైకి లేచి బయటకు వెళ్లిపోవడానికి, చల్లటి గాలి కింది గదుల్లోకి రావడానికి ఈ వ్యవస్థ దోహదపడేది. ఇరాన్ దేశంలో పుట్టిన ఈ సాంకేతికతను మన రాజులు తమ కోటల్లో అద్భుతంగా వాడారు.
మనం పాత కోటల్లో చూసే అందమైన జాలీ కిటికీలు (ల్యాటిస్ స్క్రీన్స్), జరోఖాలు కేవలం అందం కోసం పెట్టినవి కావు. ఈ సన్నని రంధ్రాల గుండా గాలి లోపలికి వచ్చేటప్పుడు, భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం గాలి వేగం పెరిగి, చల్లగా మారుతుంది. ఇది గదిలోని వేడిని బయటకు నెట్టేసి, ప్రత్యక్షంగా ఎండ లోపల పడకుండా ఆపుతుంది. జైపూర్లోని హవా మహల్ దీనికి గొప్ప ఉదాహరణ. నేటి తరం ఆర్కిటెక్టులు కూడా ఈ జాలీ డిజైన్లను మళ్లీ వాడుతున్నారు.
అప్పట్లో అంతఃపురాల కింద లేదా పక్కన బావులు, మెట్ల బావులు ఉండేవి. వీటి చుట్టూ ఉండే చల్లటి గాలి కోట అంతటా వ్యాపించేది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని కోటల గోడలు, పైకప్పుల లోపల మట్టి పైపులను అమర్చేవారు. వీటి గుండా నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉండేది. దీనివల్ల రాతి గోడలు లోపల నుండి చల్లబడి, ఏసీ ఆన్ చేసిన ఫీలింగ్ వచ్చేది. హంపిలోని లోటస్ మహల్, ఆగ్రా కోటలలో ఇలాంటి అధునాతన వాటర్ సిస్టమ్స్ ఉండేవి. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, కరెంట్ బిల్లుల తరుణంలో.. పర్యావరణానికి హాని చేయని ఆనాటి రాజుల Passive Cooling పద్ధతులు నేటి ఆధునిక నిర్మాణాలకు ఎంతో అవసరం. మన పూర్వీకుల జ్ఞానం నేటికీ మనకు ఆదర్శం.
Also Read: ఈ భయంకరమైన ఎండలకి ఏసీ కంటే రూ.10 వేల బడ్జెట్ కూలరే బెస్ట్ ఛాయిస్.. ఎందుకో తెలుసా?