Police Operation: హైదరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారుజామున భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ థండర్ బోల్ట్ పేరుతో మాన్ గార్ బస్తీలో కార్డన్ సెర్చ్ జరిపారు. దీంట్లో ఏకంగా 1100 మంది పోలీసులు పాల్గొని.. ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో గంజాయి, మద్యం బాటిళ్లు, దగ్గు మందు సీసాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు పలువురు పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్ గార్ బస్తీలో అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టుగా పోలీసులకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్భాల్, అదనపు సీపీ (క్రైమ్స్) ఎస్.ఎం.శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ల నేతృత్వంలో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్, సీసీఎస్, సీఏఆర్ తోపాటు స్థానిక పోలీసులు దాదాపు 11వందల మంది తెల్లవారుజాము 3.30 గంటల నుంచే కార్డన్ సెర్చ్ మొదలు పెట్టారు.
Also Read: BSNL మహా అద్భుతం.. ఏకంగా రూ.1.34 లక్షల ఫోన్ లాంచ్.. ప్రత్యేకత తెలిస్తే ఫ్యూజులు ఔట్!
ఇంటింటా సోదాలు చేశారు. ఈ క్రమంలో 150 గంజాయి ప్యాకెట్లు, కిలో ఎండు గంజాయి, 32 దగ్గు సిరప్ మందు సీసాలను సీజ్ చేశారు. చోరీలు చేయటమే వృత్తిగా చేసుకున్న కొందరు పాత నేరస్తులతోపాటు స్నాచర్లు, ఎన్బీడబ్ల్యు పెండింగ్ లో ఉన్న పదిహేను మంది అనుమానితులను పట్టుకున్నారు. ఇక, చోరీలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు ఉన్న మరో యాభై మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు.
Also Read: బేస్మెంట్లు, లిఫ్టుల్లో నెట్వర్క్ ఎందుకు పనిచేయదు? అసలు నిజం ఇదీ!